హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): శంషాబాద్లో ప్రతిపాదిత 100 పడకల ఈఎస్ఐ దవాఖాన నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నుంచి ఈఎస్ఐ అధికారులు స్వాధీనం చేసుకొని శంకుస్థాపనకు ఏర్పాట్లుచేయాలని సూచించారు. హైదరాబాద్ ఆదర్శ్నగర్లోని ఈఎస్ఐసీ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ప్రాంతీయ కార్యాలయంలో బోర్డు సమావేశం సోమవారం మంత్రి మల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఈఎస్ఐ చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సమీక్షిస్తూ, వాటి పురోగతిపై అధికారులకు మంత్రి ఆదేశాలు జారీచేశారు. నాచారం ఈఎస్ఐ దవాఖానలో సీటీ, ఎంఆర్ఐ సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. లిఫ్టులు, ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ, పవర్ బ్యాకప్, క్యాంటిన్ సేవలు, నీటి పంప్హౌస్ మరమ్మతు తదితర పనులు గడువులోగా పూర్తిచేయాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో ఈఎస్ఐసీ ఆధ్వర్యంలో డిస్పెన్సరీ-కమ్-బ్రాంచ్ ఆఫీసును ఏర్పాటుచేయాలని చెప్పారు. సీఎస్ఐసీ నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులను సత్వరమే విడుదలచేయాలని అన్నారు. సమావేశంలో ఈఎస్ఐ సౌత్జోన్ మెడికల్ కమిషనర్ డాక్టర్ సునీతా చోప్రా, ఈఎస్ఐ సభ్యులు కేవీ శేఖర్ రాజు, రవిశంకర్, మారయ్య తదితరులు పాల్గొన్నారు.