హైదరాబాద్ సిటీబ్యూరో/సికింద్రాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఐసీయూలో చికిత్స పొందుతున్న తన కుమారుడిపై ఐటీశాఖ అధికారులు దౌర్జన్యం ప్రదర్శించి సంతకాలు చేయించారంటూ మంత్రి మల్లారెడ్డి, విధులకు మల్లారెడ్డి ఆటంకం కలిగించారంటూ ఐటీ అధికారి పరస్పరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసుకొన్నారు. రెండు ఫిర్యాదులపై జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేసిన బోయిన్పల్లి పోలీసులు.. ఘటన దుండిగల్ ఠాణా పరిధిలో జరగటంతో అక్కడికి బదిలీచేశారు. వివరాలు ఇవీ.. ఐటీ అధికారులు మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్రెడ్డి ఇంట్లో బుధవారం రాత్రి వరకు సోదాలు పూర్తిచేసి పంచనామా తయారుచేశారు.
వీటిపై సంతకం చేయాలంటూ ఐటీశాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ నేరుగా కుత్బుల్లాపూర్లోని మల్లారెడ్డి నారాయణ దవాఖానలో ఐసీయూలో చికిత్స పొందుతున్న మహేందర్రెడ్డి వద్దకు వెళ్లారు. మీరు సొంతంగా రాసుకున్న పంచనామాపై సంతకాలు ఎలా చేస్తానంటూ మహేందర్రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. విషయం తెలియగానే మంత్రి మల్లారెడ్డి, చిన్న కుమారుడు భద్రారెడ్డి బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో బోయిన్పల్లి పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదుచేయగా రత్నాకర్పై సెక్షన్ 384 కింద కేసు నమోదుచేశారు.
ఇంజినీరింగ్ కళాశాలకు డైరెక్టర్గా ఉన్న భద్రారెడ్డి నుంచి సంతకం తీసుకోవాలని కోరినా వినలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సంతకం కోసం వెళ్లిన నాతో దవాఖానలో మంత్రి మల్లారెడ్డి దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారు. పంచనామా పత్రంతో సహా ఇతరపత్రాలను చించేసి బెదిరించారు. ల్యాప్టాప్, హార్డ్డ్రైవ్ ఉన్న రెండు బ్యాగ్లను అపహరించారు’ అని ఆరోపిస్తూ బోయిన్పల్లి పోలీసులకు బుధవారం అర్ధరాత్రి 1:50 గంటలకు రత్నాకర్ ఫిర్యాదుచేశారు. దీంతో మల్లారెడ్డితో పాటు మరికొందరిపై ఐపీసీ 342, 353, 201, 504, 506. 379 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో బోయిన్పల్లి పోలీస్స్టేషన్ గేట్ ప్రహారీ వద్ద ఒక బ్యాగును గుర్తించిన పోలీసులు, అందులో ఉన్న ల్యాప్టాప్ మీదేనా అంటూ రత్నాకర్ను ప్రశ్నించారు. అది తనది కాదని, దాన్ని మార్చేశారంటూ ఆయన తెలిపారు.