హైదరాబాద్: స్వరాష్ట్రంలో పోలీసు శాఖ ఎంతో పురోగతి చెందిందని హోం మంత్రి మహమూద్ అలీ (Minister Mahmood Ali) అన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసు (Telangana police) వ్యవస్థ మొదటి స్థానంలో ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్లో ఉందని చెప్పారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల్లో (Telangana decade celebrations) భాగంగా సురక్షా దినోత్సవం (Suraksha dinotsavam) పేరుతో హైదరాబాద్ ట్యాంక్బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ అంజనీ కుమార్తో కలిసి హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పోలీసు శాఖకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చారని తెలిపారు. పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారని వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ పోలీసులు మొదటి స్థానంలో ఉనారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ పోలీసు శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు.
ట్యాంక్బండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ లిబర్టీ, అబిడ్స్, చార్మినార్, తెలుగుతల్లి విగ్రహం మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు, అగ్నిమాపక శకటాలను ప్రదర్శిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ర్యాలీలు, పోలీసు వాహనాల ప్రదర్శన, ఫుట్ పరేడ్ వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.