Minister KTR | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం లేఖ రాశారు. అంతర్జాతీయ డేటా రాయాబార కార్యాలయాల ఏర్పాటు విషయంలో కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఇటీవల కేంద్రమంత్రి బడ్జెట్లో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైన్సా టెక్-సిటీ (గిఫ్ట్సిటీ)లో డేటా రాయబార కార్యాలయాలను ఏర్పాటుకు ప్రతిపాదించారు. డేటా రాయబార కార్యాలయాలన్నీ ఒకే చోటు కాకుండా వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల కలిగే నష్టాలను సైతం లేఖలో ప్రస్తావించారు.
భూకంపాలు ఎక్కువ వచ్చే రాష్ట్రాల్లో గుజరాత్ ఉందని, అలాంటి ప్రాంతాల్లో డేటా ఎంబసీ కార్యాలయాలను ఏర్పాటు చేయడం వల్ల నష్టాలు కలుగుతున్నాయన్నారు. దేశంలోనే తక్కువ భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో హైదరాబాద్ ఒకటని, ఈ ప్రాంతం డేటా సెంటర్ ఏర్పాటుకు అనువైన ప్రదేశం అని తెలిపారు. గుజరాత్ సరిహద్దును మరో దేశంతో పంచుకుంటున్నందున డేటా సెంటర్ల భద్రతకు ప్రమాదకరమని, ఎంబసీ కేంద్రాల కోసం స్థలాన్ని ఎంపిక చేసే సమయంలో క్లయింట్ల భద్రతను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
డేటా సెంటర్లకు హైదరాబాద్ ఆదర్శవంతమైన నగరమని, గ్లోబల్ డేటా సెంటర్ మేజర్లు తమ భారీ డేటా సెంటర్ల ఏర్పాటులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి మైక్రోసాఫ్ట్ అజూర్ వరకు రాష్ట్రం అనేక హైపర్ స్కేల్, ఎడ్జ్ డేటా సెంటర్లకు నిలయంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2016లో డేటా సెంటర్ పాలసీని తీసుకువచ్చిందని తెలిపారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్రం అనువుగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలను సవరించాలని కేంద్రమంత్రిని కోరారు.