హైదరాబాద్ : కొవిడ్ మహమ్మారి తర్వాత చేనేత, టెక్స్టైల్ రంగాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ఈ సమయంలో జీఎస్టీని పెంచడమంటే వాటిని చావుదెబ్బకొట్టడమేనని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత, జౌళీ వస్త్రాలపై జీఎస్టీని కేంద్రం 5 శాతం నుంచి 12శాతానికి సవరించగా, వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నది. ఈ క్రమంలో కేటీఆర్ ఆదివారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు. ఈ సందర్భంగా జీఎస్టీ పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి టెక్స్టైల్, చేనేత రంగాలకు ఉపాధి కల్పిస్తున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో వాటికి అదనంగా ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు అందించి ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన సమయంలో పన్నులు పెంచడం సరైంది కాదన్నారు. దేశ చరిత్రలో చేనేత ఉత్పత్తులపై ఎప్పుడూ పన్ను లేదని, కేంద్రం జీఎస్టీ ద్వారా మొదటిసారి 5శాతం విధించిందని గుర్తు చేశారు. ఆ సమయంలో చేనేత రంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందన్నారు.
చేనేతపై అదనంగా ఏడు శాతం జీఎస్టీ విధించాలన్న ప్రస్తుత నిర్ణయం ఆయా రంగాలను మరింత కుంగదీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి చేనేత వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయని, జీఎస్టీ పెంపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కార్మికులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. 2017 మే 18న జీఎస్టీ కౌన్సిల్ చేనేత ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు లేకుండా ఉండాలని తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని సూచించారు. జీఎస్టీ పెంపు ప్రతిపాదనను విరమించుకోకుండా ముందుకెళ్లాలనుకుంటే చేనేత, పవర్లూం వ్యాపారులకు ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ బేస్ జీఎస్టీ మినహాయింపును రూ.20లక్షల నుంచి రూ.50లక్షలకు పెంచాలని, దీంతో లక్షలాది మంది చేనేత వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.