హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కెనడా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడు, సీఈవో గోల్డీ హైదర్ శనివారం ప్రగతిభవన్లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావుతో భేటీ అయ్యారు. కెనడా వాణిజ్య రంగంలో అత్యంత ప్రభావవంతమైన, అతిపెద్ద సంస్థగా బిజినెస్ కౌన్సిల్కు పేరున్నది. ఈ సందర్భంగా హైదర్ను మంత్రి కేటీఆర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలను ఈ సందర్భంగా గోల్డీ హైదర్కు కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే కెనడా సహా అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టినట్టు తెలిపారు. కెనడాలోని ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని కోరారు.
ముఖ్యంగా ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి, ఈవీ తదితర రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉన్నదని, ఇక్కడ ఆయా రంగాలకు చెందిన వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉన్నదని వివరించారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్లో ఏర్పాటుచేసినట్టు గుర్తుచేశారు. కెనడా సంస్థలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.