హైదరాబాద్, జూలై 8 (నమస్తేతెలంగాణ): ‘రేవంత్రెడ్డి..మీ అన్నదమ్ములే (డీకే శివకుమార్, చంద్రబాబు) కొట్టుకుపోయిన డ్యామ్లను మళ్లీ కడుతున్నరు.. మీరు మాత్రం మేడిగడ్డ 2 పిల్లర్ల పేరిట చిల్లర రాజకీయాలు చేస్తున్నరు..’అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేడిగడ్డపై రాద్ధాంతం వద్దంటూ సూచించారు. జూన్లో కర్ణాటకలోని హోస్పేట్లో జరిగిన తుంగభద్ర 33 క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ వేదికపై ఏపీ, కర్ణాటక సీఎంలు చంద్రబాబు, డీకే శివకుమార్తో రేవంత్రెడ్డి కలిసి ఉన్న ఫొటోని ‘ఎక్స్’లో బుధవారం ఆయన షేర్ చేశారు. కొట్టుకుపోయిన ప్రాజెక్టుల మరమ్మతు విషయంలో వారిద్దరూ వ్యవహరిస్తున్న తీరును పోల్చుతూ సీఎం రేవంత్రెడ్డి వైఖరిని ఎత్తిచూపారు.
‘తుంగభద్ర డ్యామ్లో 19వ నంబర్ క్రస్ట్గేటు కొట్టుకుపోతే ఆయన ఆ ఒక్క గేటుకు ప్యాచ్వర్క్ చేసి చేతులు దులుపుకోలేదు. డ్యామ్ భద్రతను దృష్టిలో పెట్టుకొని మొత్తం 33 క్రస్ట్ గేట్లను రూ. 54 కోట్లతో పూర్తిగా మార్చేశారు. రెనొవేషన్ పనులను రికార్డుస్థాయిలో పూర్తిచేసి ప్రాజెక్టును సిద్ధం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలతో పోలవరం ప్రాజెక్టులోని రూ. 400 కోట్ల విలువైన డయాఫ్రం వాల్ గత ఆగస్ట్ 2020 వరదల్లో కొట్టుకుపోయింది. మరో మీ ప్రియమైన బ్రదర్ చంద్రబాబు అధికారంలోకి రాగానే రూ.వెయ్యికోట్లు వెచ్చించి పునర్నిర్మించారు’ అని గుర్తుచేశారు. ‘కానీ హోస్పేట్లో వారిద్దరూ సోదరులంటూ ఉపన్యాసం దంచిన మీరు (రేవంత్రెడ్డి) మాత్రం మేడిగడ్డకు చెందిన 2 పిల్లర్లపై రాజకీయం చేస్తున్నరు.. మరమ్మతు చేతగాక తొక్కుడు రాజకీయం చేస్తూ రైతుల నోట్లో మట్టిగొడుతున్నరు’ అంటూ విమర్శలు గుప్పించారు.