Minister KTR | జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ)/పరకాల/తొర్రూరు: ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మొదట భూపాలపల్లిలో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లతోపాటు గృహలక్ష్మి, దళితబంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. సుభాష్కాలనీ పక్కనే గల మినీ స్టేడియంలో భారీ బహిరంగసభలో పాల్గొంటారు. పరకాలలో మున్సిపాలిటీ, తహసీల్, ఆర్డీవో కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు.
చలివాగుపై చెక్డ్యాం, ధోబీఘాట్, డిగ్రీ కళాశాల నూతన భవనం పనులకు శంకుస్థాపన చేస్తారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందించనున్నారు. పట్టణంలోని పశువుల అంగడి ఆవరణలో బహిరంగ సభలో పాల్గొంటారు. అదేవిధంగా తొర్రూరులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, నూతన మున్సిపల్ కార్యాలయ భవనం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొర్రూరు పెద్ద చెరువు వద్ద మినీ ట్యాంక్బండ్, శుద్ధి చేసిన మంచినీటి సరఫరా పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. పాలకేంద్రం సమీపంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం జనగామ జిల్లా కొడకండ్లకు చేరుకొని మినీ టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.