రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): గుజరాత్లో మహాత్మాగాంధీ చరఖా తిప్పి నూలు వడికి స్వదేశీ ఉద్యమానికి నాంది పలికితే.. అదే నూలుపై సిగ్గు లేకుండా ఐదు శాతం పన్నువేసిన మొదటి ప్రధాని నరేంద్ర మోదీ అని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పన్నులు ఉపసంహరించుకోవాలని చెప్పినా పట్టించుకోలేదని, మోదీ విధానాలే చేనేతకు మరణశాసనంలా మారాయని మండిపడ్డారు.
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం సిరిసిల్ల పట్టణ శివారులోని మానేరు బ్రిడ్జి సమీపంలో ఎల్లమ్మ గుడి వద్ద రూ.50 లక్షలతో ఏర్పాటుచేసిన కొండా లక్ష్మణ్ కాంస్య విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద రూ.కోటితో ఆధునికీకరించిన ముస్లిం శ్మశానవాటిక, రూ.18 లక్షలతో కొనుగోలుచేసిన ఆఖరీ సఫర్ వాహనాన్ని ప్రారంభించారు. రూ.2 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఆధునికీకరణ, రూ.2.29 కోట్లతో చేపట్టనున్న వెంకంపేట మెయిన్రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల అర్బన్ మండలం రాజీవ్నగర్లో రూ.13 లక్షలతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ భవనాన్ని ప్రారంభించారు.
కొండా లక్ష్మణ్ విగ్రహం వద్ద జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. సిరిసిల్లకు మెగాపవర్లూం క్లస్టర్ ఇవ్వాలని, తెలంగాణకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూం మంజూరు చేయాలని పదేపదే చేసిన విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఎనిమిదేండ్లుగా అడుగుతున్నా ఒక్కటంటే ఒక్క పనైందా? ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణకు, ఏ ఒక్క వర్గానికీ వీసమెత్తు పనికాలేదని మండిపడ్డారు. ‘ఉత్తగనే హిందూ, ముస్లిం అనగానే ఆగం కాకండి… దేవుడి పేరుతో రాజకీయం చేయగానే కింద మీద కావద్దు’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
‘మాట్లాడితే దేవుడంటరు. ఎములాడ దేవుడికి ఏమన్న ఇచ్చారా అంటే ఏమీ లేదు. అల్లికి అల్లి.. సున్నకు సున్న. దేవుని పేరిట రాజకీయం చేసి నాలుగు ఓట్లు దొబ్బుకోవాలె. ప్రజలను ఆగం జెయ్యాలె. పోరగాండ్లను రెచ్చగొట్టాలె. అందుకే మిమ్మల్ని కోరుతున్నా.. దయచేసి, కూర్చున్న కాడ చర్చ పెట్టండి.. ఎనిమిదేండ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏమి చేసిందో? ఎనిమిదేండ్ల మోదీ ప్రభుత్వం దేశానికి, తెలంగాణకు ఏమిచేసిందో? రైతు, నేత, గీతన్నలు, ప్రతి కులం, మతం తెలంగాణలోని ప్రతిబిడ్డ చర్చపెట్టి, నిగ్గదీసి అడగాలె. తప్పు చేస్తే మమ్మల్ని కూడా ప్రశ్నించండి’ అని పిలుపునిచ్చారు.
ఎంపీగా కరీంనగర్కు ఏం చేసినవ్
ఎనిమిదేండ్ల పాలనలో తాము చేసిందేమిటో స్థానిక ప్రజలే చూపిస్తారని, ఎంపీగా నీవు చేసిందేమిటో చెప్పాలని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మంత్రి కేటీఆర్ నిలదీశారు. బండి సంజయ్కి చేనేత కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని ఎత్తివేయించాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఏర్పడకముందు సిరిసిల్లలోని నేతన్నల ఆకలిచావులు, ఆత్మహత్యలు చూసి చలించిపోయిన ఆనాటి ఉద్యమ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడే జోలే పట్టుకుని తిరిగి రూ.50 లక్షలు సేకరించి నేతన్నలకు భరోసా కల్పించారని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కార్మికుడిని యజమాని చేయాలన్న ఉద్దేశంతో వర్కర్టూ ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు.
చంద్రబాబు అవమానించిన చోటే బాపూజీ విగ్రహం
తెలంగాణ వైతాళికుల గొప్పదనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకే విగ్రహాలు ఏర్పాటు చేసున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎవరూ అడగకుండానే కొత్త జిల్లాలకు, యూనివర్సిటీలకు వైతాళికుల పేర్లు పెట్టినట్టు చెప్పారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారని గుర్తుచేశారు. తెలంగాణ భావజాలాన్ని అణచివేస్తున్న కరడుగట్టిన సమైక్యవాదులు ఏలుతున్న కాలమది. హుస్సేన్సాగర్ తీరాన తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి కొండా లక్షణ్ బాపూజీ నిర్మించుకున్న జలదృశ్యం భవనాన్ని నేటమట్టం చేసింది చంద్రబాబు సర్కారు. ఏ జలదృశ్యంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్భవించిందో, ఏ జలదృశ్యాన్నయితే అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో.. అక్కడే కొండా లక్ష్మణ్ బాపూజీ 15 అడుగుల విగ్రహాన్ని టీఆర్ ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేసింది. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీఎల్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గోలి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
శ్రావణ్.. జుట్టు ఇలా.. పెళ్లి ఎలా..!
సిరిసిల్ల పర్యటనలో భాగంగా రాజీవ్నగర్లోని బస్తీ దవాఖాన ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్ అక్కడే ఉన్న యువకులు, చిన్నారులతో సరదాగా గడిపారు. శ్రావణ్ అనే బాలుడిని ‘నీ జుట్టు తెల్లగా ఉంది.. పెళ్లి ఎలా మరి..’ అంటూ సరదాగా సంభాషించి నవ్వులు పూయించారు. శ్రావణ్ జుట్టు తెల్లగా ఎందుకు అయిందని అక్కడే ఉన్న వైద్యుడు రమేశ్ను పిలిచి అడిగారు.
‘సొంతింటిని టీఆర్ఎస్కు ఇచ్చిన మహనీయుడు కొండా’
తన సొంత నివాసాన్ని తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు పెట్టుకోవాలని ఇచ్చిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ కొనియాడారు. తొలి తెలంగాణ ఉద్యమం ఎదురుదెబ్బలు తిన్నా.. తెలంగాణ ఆకాంక్షను లక్ష్మణ్ బాపూజీ వదలలేదని, రాష్ట్రం కోసం ఉద్యమించిన నాయకుడని పేర్కొన్నారు. రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమం కోసం చేతి నిండా పని, బీమాతో ధీమా కల్పించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని కొనియాడారు. సిరిసిల్లను సిరి సంపదలకు కేంద్ర బిందువుగా మార్చిన ఘనత కేటీఆర్ది అని పేర్కొన్నారు.