Minister KTR | సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఓ కులానికో, మతానికి సంబంధించిన వారు కాదని.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆత్మ గౌరవ పోరాటమని ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్ బైపాస్రోడ్డులో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం పద్మనాయక కల్యాణమండపంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాపన్నగౌడ్ పది మందితో పోరాటాన్ని ప్రారంభించి.. గోల్కొండ కోటపై జెండా ఎగురవేశారన్నారు.
కేసీఆర్ అదే మాదిరి పోరాటం చేసి గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారన్నారు. గౌడ కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. గౌడ కుల సంఘ భవనానికి రెండెకరాల స్థలం, భవన నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏ గ్రామంలో ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంటే ఈత, తాటి వనాలను పెంచేందుకు కేటాయిస్తామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నామన్నారు. సిరిసిల్ల గౌడన్నలకు తెలంగాణలో మొదటిసారిగా సేఫ్టీ మోకులు అందజేస్తామన్నారు. కోనసీమ, పాపికొండలను మించి సిరిసిల్ల తయారైందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెబితే సంతోషంగా అనిపించిందన్నారు. కరెంటు, సాగునీటి, తాగునీటి కష్టాలను శాశ్వత పరిష్కారం చూపామన్నారు.
టాటాలే కాదు.. తాతల నాటి కులవృత్తులు బాగుపడాలని, అన్ని వర్గాలు, కులాలు బాగుపడాలన్నారు. వెయ్యి గురుకులాలు జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ అయ్యాయన్నారు. రాజన్న సిరిసిల్లలోనూ నీరా కేఫ్ ఏర్పాటు చేస్తామన్నారు. మల్కపేట జలాశయాన్ని వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ప్రకటించారు. మల్కపేట జలాశయం నుంచి సింగసముద్రం, అక్కడి నుంచి బట్టల చెరువు మీదుగా నర్మాల డ్యామ్ను నింపుతామని, ఇప్పటికే నర్మాల డ్యామ్ను మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా నింపుతున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మానేరులో 365 రోజులు నీరు పారుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మానేరు బ్రిడ్జి వద్ద బోటింగ్ను ప్రారంభించారు. స్వయంగా బోట్ను నడిపారు. అలాగే బైపాస్ రోడ్డులో కొత్తగా నిర్మించిన కే కన్వెన్షన్ సెంటర్ను సైతం ప్రారంభించారు. ఏరియా దవాఖానాలో 40కేవీ రూప్టాప్ సోలార్ ప్లాంట్ను, 130 అదనపు బెడ్స్, క్యాన్సర్ బాధితుల కోసం కీమోథెరఫీ డేకేర్ సెంటర్కు ప్రారంభోత్సవం చేశారు.