హైదరాబాద్ : పెండ్లయినా, కాకపోయినా అబార్షన్ చేయించుకొనే హక్కు మహిళలకు ఉన్నదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అబార్షన్ చేయించుకొనే హక్కు మహిళలకు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.
గర్భం దాల్చినప్పటి నుంచి 24 వారాలలోపు వరకు గర్భాన్ని తీయించుకోవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది. వైద్య సంబంధ గర్భస్రావ చట్టానికి (ఎంటీపీ) సంబంధించిన ఓ కేసుపై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం.. గర్భం తొలగింపులో వివాహితలు, అవివాహితలు అన్న తేడా చూపించటం రాజ్యాంగానికి విరుద్ధమని వెల్లడించింది. ‘ఎంటీపీ చట్టం ప్రకారం మహిళలందరికీ సురక్షితంగా గర్భం తీయించుకొనే హక్కు ఉన్నది. పెండ్లి కానందున గర్భాన్ని తొలగించే హక్కు లేదని చెప్పలేం. అది వివక్ష చూపటమే. దాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం.. గర్భం ఉంచుకోవాలా? తీయించుకోవాలా? అన్న హక్కు వివాహితతో సమానంగా, అవివాహితకు కూడా ఉన్నది. సామాజిక సందర్భాలను బట్టి నిబంధనలు మారుతుంటాయి’ అని ధర్మాసనం తెలిపింది.
Wholeheartedly applaud & welcome the landmark Pro-Choice judgement delivered by the Hon’ble Supreme Court of India on the #AbortionRights women👏👏
— KTR (@KTRTRS) September 30, 2022