Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అక్టోబర్ 4న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. ఈ మేరకు పర్యటన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన తర్వాత నిర్మల్ పట్టణంలోని మినీ ఎన్టీఆర్ స్డేడియంలో మధ్యాహ్నం 12 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ.714 కోట్ల వ్యయంతో చేపట్టిన లక్ష్మీనర్సింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని (27ప్యాకేజ్) ప్రారంభించనున్నారు.
మిషన్ భగీరథ పథకంలో భాగంగా రూ.23.91 కోట్ల వ్యయంతో నిర్మల్ పట్టణంలో ఇంటింటికి నల్లా నీటి సరఫరాను ప్రారంభిస్తారు. సోన్ మండలం పాత పోచంపడ్ గ్రామంలో 40 ఎకరాల విస్తీర్ణంలో రూ. 250 కోట్ల వ్యయంతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. నిర్మల్ పట్టణంలోని తహసీల్ కార్యాలయ స్థలంలో 2.30 ఎకరాల విస్తీర్ణంలో రూ.10.15 కోట్ల వ్యయంతో అధునాతన హంగులతో నిర్మించనున్న సమీకృత మార్కెట్కు శంకుస్థాపన చేయనున్నారు.
నిర్మల్ పట్టణంలో రూ.2కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో నిర్మించే దోబీఘాట్ పనులకు, నిర్మల్ పట్టణంలో రూ.4కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అమృత్ పథకంలో భాగంగా రూ.62.50 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు, రూ.50 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టే పలు అభివృద్ధి పనులకు, ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా రూ. 25 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభలో పాల్గొనున్నారు.