KTR | జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ నెల 9న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. తొర్రూరులో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్క్కు శంకుస్థాపన, పాలకుర్తిలో రూ.17.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న 50 పడకల వైద్యశాలలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే తొర్రూరులో 20వేల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనుండగా.. అంతకు ముందు 12వేల మందితో తొర్రూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొర్రూరులో ఖమ్మం హైవేరోడ్డు పక్కన, పాలకేంద్రం సమీప స్థలాన్ని కలెక్టర్ శశాంక్తో కలిసి పరిశీలించారు. తొర్రూరు, పెద్ద వంగర, రాయపర్తి మండలాల్లో ముఖ్య నేతలు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కోసం కేటీఆర్ వస్తారన్నారు. ఆ తర్వాత బైకు ర్యాలీ, బహిరంగ సభలు ఉంటాయని చెప్పారు. నియోజకవర్గవ్యాప్తంగా భారీగా ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ, 20వేల మందితోనే సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకు ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయని, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు.