E-Commerce | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ఈ కామర్స్ రంగం మానవ జీవితాన్ని అత్యంత ప్రభావితం చేస్తూ వేగంగా దూసుకుపోతున్నదని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పుస్తక విక్రయాలు, ఎఫ్ అండ్ జీ సహా అన్ని రంగాల్లో భౌతిక విక్రయాల (ఫిజికల్ సేల్స్) స్థానంలో ఈ కామర్స్ రంగం వేళ్లూనుకొన్నదని చెప్పారు. దేశంలో అన్ని వస్తువులు ఆన్లైన్ ద్వారా కొంటున్నారని, ఈ కామర్స్ ద్వారా నచ్చిన వస్తువులను కొనుక్కోవచ్చని పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఏర్పాటుచేసిన ఫ్లిప్కార్ట్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను మంత్రి కేటీఆర్ మంగళవారం బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్లిప్కార్ట్ సంస్థకు మంచి పేరుప్రఖ్యాతులున్నాయని, మనదేశంలో లీడర్గా రాణిస్తున్నదని ప్రశంసించారు. మారిన పరిస్థితుల్లో ఎకానమీ అర్థమే మారిపోతున్నదని, గిగ్ ఎకానమీ, గిగ్ జాబ్స్పై ఆధారపడేవారి సంఖ్య ఏటా పెరుగుతున్నదని చెప్పారు.
తెలంగాణలో స్వయం సహాయక బృందాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని.. వారితో ఫ్లిప్కార్ట్ చేతులు కలిపి మందుకెళ్లాలని సూచించారు. ఉపాధి కల్పనతో మహిళలకు 50 శాతం ప్రాధాన్యమివ్వాలని, తద్వారా తెలంగాణను దేశానికి రోల్ మాడల్గా మారుద్దామని పిలుపునిచ్చారు. మొత్తంగా 100 శాతం మహిళలు నడిపించే యూనిట్ను ఏర్పాటుచేయాలని ఫ్లిప్కార్ట్ ప్రతినిధులను కోరారు. ఫ్లిప్కార్ట్కు ఎంతమంది ఉద్యోగులు అవసరమున్నా.. వారికి అవసరమైన శ్రామికశక్తి (వర్క్ఫోర్స్) రాష్ట్రంలో అందుబాటులో ఉన్నదని చెప్పారు.
అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఉద్యోగాలకు సిద్ధంగా ఉండే యువతను తయారుచేయాలని సూచించారు. ఇందుకు ఫ్లిప్కార్ట్ సంస్థలో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసినందుకు ఫ్లిప్కార్ట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లిప్కార్ట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని.. భారీగా వేర్హౌజ్లు ఏర్పాటవుతున్నాయని వివరించారు.
రాష్ట్రంలోనే అతిపెద్ద ఫెసిలిటీ సెంటర్
తాము రాష్ట్రంలోనే అతిపెద్ద ఫెసిలిటీని సంగారెడ్డిలో ఏర్పాటు చేసినట్టు ఫ్లిప్కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. ఈ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తమ సంస్థకు 100 మంది డిస్ట్రిబ్యూటర్లు, 14 వేల మంది విక్రయదారులున్నారని, మొత్తంగా 40 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఐటీశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్, ఫ్లిప్కార్ట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.