హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణం దాదాపు పూర్తయిన నేపథ్యంలో గ్రామ, మండల కమిటీల వివరాలను నియోజకవర్గాలవారీగా స్పైరల్ బైండింగ్ చేసి గురువారం సాయంత్రంలోగా కేంద్ర కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే గ్రామ, వార్డు, మండల, పట్టణ కమిటీలు, అనుబంధ కమిటీలకు సంబంధించిన పూర్తివివరాలను అందచేయాలని కేటీఆర్ ఆదేశించారు. ఈ నెల 2 నుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీలు, 12 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీల ఏర్పాటు పూర్తయిందని పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్కు వివరించారు. పార్టీ జిల్లా అధ్యక్షులను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమిస్తారని, వారితోపాటు ఆ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు జిల్లా కమిటీని, అనుబంధ కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా రాష్ట్ర కమిటీ ఏర్పాటును పూర్తిచేయాలని పార్టీ అధినేత ఆదేశించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.