ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 5: మంత్రి కేటీఆర్ చొరవ.. ప్రభుత్వ పథకాల వర్తింపుతో నిరుపేద గిరి జన బిడ్డ సుజాత జీవితాన్ని నిలబెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బాకురుపల్లి తం డాకు చెందిన అజ్మీరా సుజాత ఐదేండ్ల వయస్సులో ఉండగా తల్లి గేనవ్వ చనిపోయింది. తండ్రి అంజయ్య మతిస్థిమితం కోల్పోవడంతో.. ఆడిపాడే వయస్సులో అన్నీ తానై తండ్రికి సపర్యలు చేస్తూనే బడికి వెళ్లేది. ఆ స్కూల్ విద్యా వలంటీర్గా పనిచేస్తు న్న సతీశ్ ఆమె దయనీయపరిస్థితిని 2011లో అప్పటి ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా తక్షణం స్పందించారు. దుమాల గురుకుల పాఠశాలలో సీటు కోసం అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్కు సిఫారసు చేశారు.
కలెక్టర్ ఆదేశంతో బాకురుపల్లికి వెళ్లిన అధికారులు.. బిక్కుబిక్కుమంటూ గుడిసెలో పొద్దెల్లదీస్తున్న సుజాతను చూసి చలించిపోయారు. వెంటనే దుమాల గురుకుల పాఠశాలలో చేర్పించారు. ఆరోతరగతిలో చేరిన సుజాత ఇంటర్ వరకు అక్కడే చదివింది. ఆ తర్వాత ఉన్నత చదువులకు ఎదురైన ఇబ్బందులను అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు రాజునాయక్.. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సుజాతకు సాయం చేయాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ను ఆదేశించారు. వెంటనే స్పందించిన అధికారులు రూ.25 వేలు అందించారు. డిగ్రీ పూర్తయిన తర్వాత ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన భాస్కర్తో గత జనవరిలో చిన్నా న్న రాంసింగ్-లక్ష్మి దంపతులు వివాహం జరిపించారు.
ఆమె పెండ్ల్లికి చేసిన అప్పులు తీర్చేందుకు కల్యాణలక్ష్మి ఆర్థికంగా తోడయ్యింది. వారం క్రితం ముస్తాబాద్ మండలం పోత్గల్ పీహెచ్సీలో సుజాత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలింతగా ఉన్న ఆమెకు సర్కారు కేసీఆర్ కిట్టు రూపంలో ఆసరాగా నిలిచింది. అడుగడుగునా అండగా నిలిచి జీవితాన్ని నిలబెట్టినందుకు సుజాత కుటుంబ సభ్యులు, బాకుర్పల్లి సర్పంచ్ మంజుల, టీఆర్ఎస్ నాయకులు అజ్మీరా రాజునాయక్ తదితరులు మంత్రి కేటీఆర్కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.