రంగారెడ్డి: ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులు ధ్వంసమయ్యాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ కుల వృత్తులను బలోపేతం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన మంత్రి.. గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నదని చెప్పారు. ప్రతి కులవృత్తికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. వైన్ షాపుల్లో గీత కార్మికులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
అదేవిధంగా గౌడన్నలకు చెట్ల పన్నును రద్దు చేశామని, కల్లు డిపోలను తెరిపించి గౌడన్నలకు అండగా నిలిచామని, చెట్ల పన్నును రద్దు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి కేటీఆర్ చెప్పారు. పెన్షన్లను రూ.200 నుంచి రూ.2016కు పెంచామని, గీత కార్మికులకు కూడా నెల రూ.2016 పెన్షన్ ఇస్తున్నామని, ఆడబిడ్డల పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో లక్ష చొప్పున సాయం చేస్తున్నామని తెలిపారు. గీత వృత్తిదారులకు మోపెడ్లు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, కానీ కేంద్ర ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖనే లేదని ఆయన ఎద్దేవా చేశారు. 2014కు ముందు రాష్ట్రంలో కరెంట్ కటకట ఉండేదని, సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కరెంట్ సమస్య పరిష్కారమైందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని, ప్రాజెక్టులు, ఉచిత కరెంటుతో వ్యవసాయాన్ని పండుగలా మార్చామని మంత్రి చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ తాగు నీరు అందించామని మంత్రి పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, 975 గురుకుల పాఠశాలలు పెట్టి ఆడబిడ్డలను ఉన్నత విద్యావంతులను చేస్తున్నామని ఆయన చెప్పారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని, ప్రతి గ్రామంలో నర్సరీ, ట్రాక్టర్, నీళ్లు, కరెంటు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.