మాదాపూర్, ఏప్రిల్ 29: మౌలికవసతుల్లో దేశంలోని అన్ని మెట్రో నగరాలకంటే హైదరాబాద్ అత్యుత్తమంగా ఉన్నదని ఐటీ, మున్సిపల్, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. 2015-20 మధ్య దేశంలోని ఏ నగరంలో చేయనంత అభివృద్ధి హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని తెలిపారు. మెర్సర్ వంటి అంతర్జాతీయ సర్వే సంస్థలు కూడా ‘బెస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్’ అని కితాబిచ్చాయని చెప్పారు. మాదాపూర్లోని హైటెక్స్లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరు అవునన్నా, కాదన్నా దేశంలో ది బెస్ట్ మెట్రో నగరం హైదరాబాద్ మాత్రమేనని స్పష్టంచేశారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు 230 కోట్ల మొక్కలు నాటామని గుర్తుచేశారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, హరితహారం వంటి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాల స్వరూపమే మార్చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు రూ.లక్ష కూడా విలువ చేయని ఎకరం భూమి నేడు రూ.15-25 లక్షల వరకు పలుకుతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సుస్థిర పాలనకు ఇది ప్రబల నిదర్శనమని అన్నారు.
ఆంధ్రా అధ్వాన్నం.. బెంగళూరు దారుణం
మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తోపాటు బెంగళూరు నగరంలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘ఆంధ్రాలో పొలాలు, తోటలున్న నా మిత్రుడు ఒకరు గత సంక్రాంతికి అక్కడికి వెళ్లి వచ్చి నాకు ఫోన్ చేసిండు. ఆంధ్రాలో కరెంటు సరిగాలేదు.. నీళ్లు రావు.. రోడ్లు ధ్వంసమైపోయాయి.. నేను తిరిగి హైదరాబాద్కు వచ్చిన తర్వాతనే ఊపిరి పీల్చుకున్న. అందుకే మీరు తెలంగాణలోని గ్రామాల నుంచి ప్రజలను ఆంధ్రాకు తీసుకెళ్లి చూపించండి. అప్పుడు తెలంగాణ ప్రభుత్వ విలువ ఏందో తెలుస్తది అన్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన ఓ బీజేపీ ఎంపీ, పార్లమెంటరీ కమిటీ సమావేశం కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే కోహినూర్ హోటల్లో బస చేసి నాకు ఫోన్ చేశారు. మాదాపూర్లో ఉన్న తమ బంధువుల ఇంటికి కేవలం ఏడు నిమిషాల్లో వెళ్లాను.. మా దగ్గర హైదరాబాద్లో ఉన్నట్టు ఫ్లైఓవర్లు లేవు అన్నారు. బెంగళూరు నుంచి పెట్టుబడిదారులు నాకు ఫోన్ చేస్తుంటారు. హైదరాబాద్లో విమానాశ్రయం నుంచి నగరంలోకి అర్ధగంటలో చేరుకోవచ్చు. బెంగళూరులో మాత్రం రెండు, రెండున్నర గంటలు పడుతుంది. ఎప్పుడు చేరుకొంటామో కూడా తెల్వదు అని చెప్తరు. అంతేకాదు.. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి నగరాలు తిరిగొచ్చిన పెట్టుబడిదారులు కూడా హైదరాబాద్లోనే బాగుంది, మేం ఇక్కడికే వస్తామని అంటున్నారు’ అని కేటీఆర్ చెప్పారు.
మాటలకే పరిమితమైన కేంద్రం
ప్రజలను మభ్యపెట్టేందుకు కల్లబొల్లి హామీలివ్వటం తప్ప కేంద్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ఏ ఒక్క పనీ చేయలేదని మంత్రి కేటీఆర్ వివర్శించారు. ‘దేశంలోని ప్రతీ పేద కుటుంబానికి 2020 నాటికి సొంత ఇల్లు కట్టిస్తామని మోదీ ప్రభుత్వం చెప్పింది.. కట్టిచ్చిందా? బుల్లెట్ ట్రైన్లను అందుబాటులోకి తెస్తామని చెప్పింది. ఎక్కడన్నా నడుస్తున్నయా? ఎన్నికల్లో వాళ్లు ఎన్నో హామీలిచ్చారు.. ఏదీ అమలుచేయలేదు. కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పనివి కూడా ఎన్నో చేసి చూపించారు. కేసీఆర్ దక్షత, సమర్థతతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, నీళ్లు అందించారు’ అని వెల్లడించారు. నిర్మాణ రంగంలో శిక్షణ సంస్థలను ఏర్పాటుచేసి ప్రజలకు ఉపాధి చూపాలని క్రెడాయ్ ప్రతినిధులను కోరారు. ఈ రంగాల్లో ఇతర రాష్ర్టాల వారిపై ఆధారపడేకంటే స్థానికులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కెడ్రాయ్ సభ్యులు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే నిర్మాణ రంగం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావు, కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, ఉపాధ్యక్షులు ఆనంద్రెడ్డి, రాజేశ్వర్, జైదీప్రెడ్డి, బీ జగన్నాథరావు, కోశాధికారి ఆదిత్య గౌర, సంయుక్త కార్యదర్శి శివరాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
నగరాలే ఆర్థిక చోదక శక్తులు
దేశాన్ని నడుపుతున్న ఆర్థిక ఇంజిన్లు పట్టణాలు, నగరాలేనని కేటీఆర్ అన్నారు. నిర్మాణ తదితర రంగాల నుంచే సంపద సృష్టి జరుగుతున్నదని పేర్కొన్నారు. ‘మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల హైదరాబాద్ వచ్చినప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి 45-50% జీఎస్డీపీ వస్తుందని నేను చెబితే ఆయన ఆశ్చర్యపోయారు. మైక్రోసాఫ్ట్ సంస్థ దాదాపు 190 దేశాల్లో పనిచేస్తున్నదని, కేవలం 70 నగరాల నుంచి మాత్రమే 80 % ఆదాయం వస్తున్నదని ఆయన చెప్పారు. దేశంలో హైదరాబాద్లాంటి నగరాలు చాలా తక్కువ. టాప్-10 నగరాలే దేశ ఆర్థిక చోదక శక్తులు. వీటిని మంచిగా చూసుకోకపోతే జాతీయ వైఫల్యం కిందికే వస్తుంది. దేశంలోని మెట్రో నగరాల అభివృద్ధికి కేంద్రం ఐదేండ్లపాటు నిధులిస్తే అద్భుతంగా తీర్చిదిద్దవచ్చని 2014లో సీఎం కేసీఆర్ సూచించినప్పటికీ ప్రధాని మోదీ పట్టించుకోలేదు’ అని తెలిపారు.
ఈ రోజు ఒక సమావేశంలో యథాలాపంగా నేను చేసిన వ్యాఖ్య ఏపీలోని నా మిత్రులకు కొంత బాధను కలిగించినట్టుంది. ఏపీ సీఎం జగన్ గారితో నాకు గొప్ప సోదరభావ సంబంధాలున్నాయి.ఆయన నేతృత్వంలో ఏపీ సమృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
– ట్విట్టర్లో మంత్రి కేటీఆర్