KTR | పచ్చని పంటల తెలంగాణ కావాల్నా..? మతం మంటల్లో నలిగిపోయే తెలంగాణ కావాలో ఆలోచన చేయాలని ప్రజలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా ఖాజీపేటలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలను కేటీఆర్ తూర్పారబట్టారు. ‘తొమ్మిదేళ్లు చేసిన కష్టం. ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో వరుసగా రెండుసార్లు ప్రభుత్వం చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా జోడించి అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న సందర్భం.
కానీ, ఎలక్షన్లు వస్తున్నయంటెనే సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు బీజేపీ, కాంగ్రెసోళ్లు ప్రజల్లోకి వచ్చి అయోమయానికి గురి చేసేవిధంగా, మాయలు చేసేవిధంగా ఉన్నయ్ లేనట్టు.. లేనియి ఉన్నట్లు మసిపూసి మారేడు కాయచేసినట్లు.. గోల్మాల్ గోవిందం కార్యక్రమాలు మళ్లీ మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో హన్మకొండలో వినయ్ భాస్కర్ని గతంలో వచ్చిన మెజారిటీ కంటే డబుల్ మెజారిటీతో గెలిపించుకుంటరన్న నమ్మకం నాకున్నది. పేదలందరికీ అన్నలా, తమ్ముడిలా అందుబాటులో ఉంటూ.. 30 సంవత్సరాలుగా మీలో ఒకడిగా ఉంటూ ప్రభుత్వ చీఫ్విప్గా కొనసాగుతున్నారు. కేసీఆర్ నాయకత్వంలో పక్క నియోజకవర్గానికి, పక్క రాష్ట్రానికి పొమ్మన్నా సర్వదా సిద్ధంగా ఉండే నాయకుడు వినయ్ భాస్కర్. ఆయన బాధ్యత పెరిగింది కాబట్టి.. గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలి’ అన్నారు.
‘అందరూ ఒక్కటే ఆలోచించాలని కోరుతున్నా. ఇదే ఓరుగల్లు మీద గడ్డ మీద చూసిన. లక్షలాది మంది పిల్లలు పదో పరీక్షరాస్తుంటారు ప్రతీ సంవత్సరం. ఓ దుర్మార్గుడు, ఓ చిల్లర మల్లర బీజేపీ నాయకుడు.. మరో నేతతో తోడై ఆఖరికి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రశ్నాపత్రాలను లీక్ చేశారు. 9.30 గంటలకు పరీక్షా మొదలైతే ఫొటోలు తీసి, లీక్ అయ్యిందంటూ తల్లిదండ్రులు, విద్యార్థుల్లో అయోమయం సృష్టించి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని, పిల్లలను రెచ్చగొట్టాలని, భావోద్వేగాలకు గురి చేయాలని, శాంతిభద్రతలకు దారితీయాలని దిక్కుమాలిన ఓ బీజేపీ నాయకుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సూచన మేరకు లీక్ చేశాడు.
వెంటనే ఇక్కడ పోలీసులు పట్టుకొని.. చట్టప్రకారం జైలులో పెట్టారు. జైలులో పెట్టడమే కాకుండా వెధవ పనికి పూనుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని నోటీసులు ఇస్తే.. ఎంత దరిద్రం, ఎంత చెండాలమైన రాజకీయం తయారైందంటే ఇవాళ.. ఆయన రాకపోవడమే కాకుండా ఆఖరికి ఓ దుర్మార్గుడైతే ప్రశ్నాపత్రం లీక్ చేశాడో.. ఆయన బెయిల్పై బయటకు వస్తే ఏదో స్వాతంత్య్ర సమరయోధుడు బయటకు వచ్చినట్లు ఆయనకు దండలు, శాలువలు కప్పి సిగ్గులేకుండా సన్మానం చేసిన నీచమైన పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఒకే ఒక పార్టీ బీజేపీ పార్టీ. ఇంతకన్న దిగజారుడు రాజకీయం ఉంటుందా? ఇంతకంటే చెండాలపు రాజకీయం ఉంటుందా? దమ్ముంటే.. మీకు సత్తా ఉంటే.. పనుల్లో పోటీపడాలి.
మేం ఒక మంచి పని చేస్తే.. మీరు కేంద్రంలో ఉన్నరు రెండు మంచిపనులు చేయండి. మేం ఒక సంక్షేమ పథకం అమలు చేస్తే.. మీరు రెండు చేసి ప్రజల మనసు గెలుచుకోండి. ప్రజలంతా ఒకటే ఆలోచన చేయాలి. ఒకేసారి దొంగలందరినీ పట్టుకోగానే మొత్తం లీకేజీలు బంద్ అయ్యాయి. ఎంత చెండాలమైన రాజకీయం, ఎంత దిగజారుడు రాజకీయం. ఎంత భావదారిద్రపు పార్టీయో ఆ పార్టీ ఆలోచన చేయాలని కోరుతున్నా. ఇంకా రానురాను కుట్రలు పెరుగుతయ్’ అంటూ హెచ్చరించారు.
‘2014 ముందు తెలంగాణ గడ్డపై రక్తం పారింది. నక్సలిజం సమస్య కావొచ్చు. మరో సమస్య కావొచ్చు. రకరకాల సమస్యల కారణంగా నెత్తురుకారిన నేల తెలంగాణ. ఇప్పుడిప్పుడే తెలంగాణ నేలపై నీళ్లుపారుతున్నయ్. సాగునీరు, ఇంటిముందు నల్లా విప్పితే తాగునీరు వస్తున్నయ్. బీజేపీ ఆలోచన ఒక్కటే.. తెలంగాణలో నెత్తురుపారాలి, తెలంగాణలో కులం పేరుమీద, మతంపేరు మీద కొట్టుకు సావాలే. తెలంగాణలో పేపర్ లీకేజీలు చేయాలి. తెలంగాణలో నిరుద్యోగులను, పిల్లలను రెచ్చగొట్టాలి.
ఏదో ఒకటి చేసి కేసీఆర్ను బద్నాం చేయాలి.. నాలుగు ఓట్లు దండుకోవాలి. చిల్లర ప్రయత్నమైనా, కుట్రనైనా చేసి అధికారంలోకి రావాలి. ఇది బీజేపీ ఎజెండా. చైతన్యానికి ప్రతీక అయిన ఓరుగల్లు.. చైతన్యవంతులు, కవులు, కళాకారులు, మేధావులుండే ఓరుగల్లు ఆలోచించాలని కోరుతున్నా. మనకు పచ్చని పంటల తెలంగాణ కావాల్నా..? మతం మంటల్లో నలిగిపోయే తెలంగాణ కావాలా? ఆలోచండి. నెత్తురుకారే తెలంగాణ కావాలా? నీళ్లు పారుతున్న బంగారంలాంటి చక్కటి తెలంగాణ కావాలా? ఆలోచించాలి. ఇదే ఓరుగల్లులో తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఒకటి కాదు రెండు కాదు ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి తిరిగి చూడాలని కోరుతున్నా’నన్నారు.
‘తెలంగాణ ప్రభుత్వం వచ్చాక.. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గవర్నమెంట్ దవాఖాన ఎక్కడ ఉన్నది అంటేనే.. అది వరంగల్లోనే నిర్మాణవుతున్న వరంగల్ హెల్త్ సిటీ. రూ.1116 కోట్లతో 24 అంతస్తుల్లో దేశానికే ఆదర్శంగా 2వేల పడకలతో ఒక్క వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగామ జిల్లాలకే కాదు పక్కనే ఉన్న మరో 10-12 జిల్లాలకు కల్పతరువులా వరంగల్ మారబోతున్నది. ఈ కల్పన, ఈ ఆలోచన, పేదలకు గొప్ప వైద్యం అందించాలన్న ఆలోచన, వరంగల్లో హెల్త్ సిటీని నిర్మించాలన్న ఆలోచన.. హైదరాబాద్కంటే పెద్దదైన ఆసుపత్రిని నిర్మించాలన్న ఆలోచన ఇదివరకు ఉన్న ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలకు ఎందుకు రాలేదు? అని అడుగుతున్నా’నన్నారు.
‘ఇంకా దరిద్రం ఏంటంటే.. ఎన్ని అబద్ధాలు మాట్లాడుతారంటే 2014లో పార్లమెంట్లో చట్టం తెచ్చి ఆంధ్రా నుంచి తెలంగాణను వేరు చేసిన సమయంలో చట్టంలో స్పష్టంగా రాశారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతాం. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. తొమ్మిదేళ్లాయే సిగ్గు, ఇజ్జత్, మానముంటే భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. మీ అడిగితే చట్టంలో పెట్టారు కదా? ఎందుకు కోచ్ ఫ్యాక్టరీ పెట్టవ్ అంటే.. పార్లమెంట్లో మంత్రి దేశంలో కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదు. అందుకే పెడుతలేమని సిగ్గులేకుండా రైల్వే అబద్ధం చెప్పారు. కానీ ఏం చేస్తున్నారో తెలుసా? ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని 160 ఎకరాలు ఇచ్చినా పెట్టరు.
కానీ, గుజరాత్లో ప్రధాని సొంత రాష్ట్రంలో 20వేలకోట్లతో కోచ్ ఫ్యాక్టరీ పెట్టారు. ఎంత పచ్చిఅబద్ధాల పార్టీ, ఎంత దగాకోరు పార్టీయో దాన్నిబట్టి మీరే చెప్పవచ్చు. చట్టంలో పెట్టిన మాటకు పార్లమెంట్లోనే తూట్లుపొడిచి.. చట్టాన్నే వాళ్ల చుట్టంగా మార్చుకొని గుజరాత్కు రూ.20వేలకోట్లతో గుజరాత్కు కోచ్ ఫ్యాక్టరీ .. మన వరకు వచ్చే సరికి మెమ్మెమ్మె.. బెబ్బెబ్బె. ములుగుకు గిరిజన యూనివర్సిటీ పెడతామని హామీ ఇచ్చారు. మనం జాగ ఇచ్చినా.. కాగితాలు పంపినా? స్పందన లేదు. కానీ, ఇక్కడకు వచ్చి రోడ్లపై డైలాగులు.. తెలంగాణను ఉద్దరించినట్లు ఏవో నిరుద్యోగ సభలని పెడుతున్నరు’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.