హైదరాబాద్, అక్టోబరు 4 (నమస్తే తెలంగాణ): ఓ వైపు తెలంగాణకు అవార్డులు ఇస్తూనే మరోవైపు కేంద్రంలోని బీజేపీ నేతలు రాష్ట్రంలో అభివృద్ధి లేదంటూ విమర్శలు చేస్తున్నారని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు. అవార్డుల రేసులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని స్పష్టంచేశారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (సాగి)లో దేశంలో 20 ఉత్తమ గ్రామాలను ప్రకటిస్తే 19 తెలంగాణ గ్రామాలే ఉన్నాయని కేంద్రమే చెప్తున్నదని.. వాళ్లే తెలంగాణలో పరిపాలన సరిగా లేదని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి అర్థరహిత విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు- 2022 సాధించిన పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కమిషనర్ల అభినందన కార్యక్రమం మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్ఆర్డీ)లో జరిగింది.
అవార్డులు పొందిన జిల్లా అదనపు కలెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాలు పురోగతి సాధిస్తాయన్నారు. ప్రజలు పట్టణాలు తమవి అని భావించినప్పుడే అద్భుత అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ దూరదృష్టికితోడు కింది స్థాయిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుడి నుంచి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వరకు అందరూ ఒకే విధానంతో పనిచేయడంతో అవార్డులు వచ్చాయని ప్రశంసించారు. ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చన్నారు. స్థానిక సంస్థలు మహిళలకు 50శాతం రిజర్వేషన్ వల్ల ఎంతో మంది అద్భుతమైన మహిళా నాయకులు పురపాలికలకు నాయకత్వం వహిస్తూ, బాగా పనిచేస్తున్నారని అభినందించారు. అవార్డులు సాధించిన ప్రతీ పట్టణ స్థానిక సంస్థకు రూ.2 కోట్ల చొప్పున అదనపు నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.
పురపాలికల్లో పది అంశాల కార్యక్రమం
రాష్ట్రంలోని మున్సిపాలిటీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి పది అంశాల కార్యక్రమం చేపడుతున్నామని కేటీఆర్ తెలిపారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మాడల్ మారెట్లు, వైకుంఠ ధామం, ఎఫ్ఎస్టీపీ, బయోమైనింగ్, మాస్టర్ప్లాన్, ఆధునిక ధోబీ ఘాట్, టీఎస్బీపాస్, మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్లు, గ్రీన్ బడ్జెట్ వంటి లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పారిశుధ్యం సరిగ్గా అమలుచేస్తే అవార్డులు అవే వెతుక్కుంటూ వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎకడా పారిశుద్ధ్య కార్మికులకు రూ.12 వేలకు తకువ జీతం ఇవ్వద్దని అధికారులకు సూచించారు. జనాభాకు తగినట్టు మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. రాష్ట్రంలో 3,700 వార్డు ఆఫీసర్ల నియామకం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో ప్రతి చుక్కా మురుగు నీటిని శుద్ధి చేయడానికి రూ.3864 కోట్లు కేటాయించామని, పనులు చురుగ్గా జరుగుతున్నాయని వెల్లడించారు.
పురపాలక శాఖ గ్లామరస్ డిపార్ట్మెంట్ కాదని, ఎంత పనిచేసినా అభినందించే వారు ఉండరని.. కానీ ఒక్క రోజు పనిచేయకపోతే తిట్టే వారు మాత్రం ఉంటారని చెప్పారు. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ సంఖ్యలో అవార్డులు వచ్చే విధంగా పని చేయాలని సూచించారు. కరీంనగర్, సిద్దిపేట లాంటి పట్టణాలకు కొద్దిలో అవార్డులు మిస్ అయ్యాయన్నారు. బైంసాలో ఎప్పుడూ మతకల్లోలాలు జరుగుతాయని ప్రచారం జరుగుతుందని.. కానీ, అక్కడ పచ్చదనం అద్భుతంగా ఉన్నదని ప్రశంసించారు. ఇంక్ వాష్ కార్యక్రమంలో ఎంపిక చేసిన 20 స్టార్టప్లను ప్రోత్సహించడానికి వారి ఉత్పత్తులను పట్టణాల్లో ప్రదర్శించాలని, వారికి మొదటి కస్టమర్గా మనమే ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, శాఖ కార్యదర్శి సుదర్శన్రెడ్డి, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, ఆస్కి ప్రొఫెసర్ శ్రీనివాసచారి ఇతర అధికారులు పాల్గొన్నారు.
జపాన్, సింగపూర్ అధ్యయనానికి..
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించిన 19 పురపాలికలకు రెండు కోట్ల చొప్పున అదనపు నిధులను ప్రోత్సాహకంగా అందిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ నిధులను పారిశుద్ధ్య నిర్వహణ కోసం వినియోగించాలని సూచించారు. తెలంగాణలోని పట్టణాలు, గ్రామాల్లో ఎంతో మార్పు వచ్చిందని.. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నదన్నారు. అవార్డులు సాధించిన 19 పట్టణ స్థానిక సంస్థలకు చెందిన చైర్పర్సన్లు, కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లను స్టడీ టూర్కు పంపించి, మరిన్ని ఉత్తమ పద్ధతులపైన అధ్యయనం చేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. వీరిలో ఉత్సాహంగా ఉన్న పదిమందిని ఎంపిక చేసి జపాన్, సింగపూర్ దేశాలకు అధ్యయనానికి పంపిస్తామని ప్రకటించారు.