రాజన్న సిరిసిల్ల : చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన యువతి కిడ్నాప్పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. వేములవాడ పర్యటనలో ఉన్న కేటీఆర్.. యువతి కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను పిలుచుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతలపై ఆరా తీశారు. మూడపల్లి యువతి కిడ్నాప్ నిందితులను సాయంత్రం లోపు పట్టుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు దురదృష్టం అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఎవరిని ఉపేక్షించొద్దని కేటీఆర్ ఎస్పీకి సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువతిని మంగళవారం తెల్లవారుజామున అపహరించారు. ఉదయం 5:20 గంటల సమయంలో ఓ నలుగురు యువకులు కారులో వచ్చారు. తన తండ్రితో కలిసి హనుమాన్ ఆలయానికి వెళ్లిన యువతిని బలవంతంగా లాక్కొచ్చి, కారులో ఎక్కించారు. అడ్డుకోబోయిన తండ్రిని తోసేశారు. అనంతరం కారును వేగంగా ముందుకు పోనిచ్చారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే ఇవాళ ఉదయం కిడ్నాప్నకు గురైన యువతికి, అదే గ్రామానికి చెందిన కట్కూరి జాన్కు గత కొంతకాలం నుంచి పరిచయం ఉంది. అయితే ఏడాది క్రితం జాన్ ఆ యువతిని బయటకు తీసుకెళ్లి, పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె మైనర్ కావడంతో.. పోలీసులు జాన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక రెండు రోజుల క్రితం ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. దీంతో జానే ఆమెను కిడ్నాప్ చేసి ఉండొచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.