హైదరాబాద్ : విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా డీజీపీ మహేందర్ రెడ్డిని రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవర్నీ సహించేది లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు.
అయితే విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఓ కార్పొరేటర్ వ్యవహార శైలిని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లారు. పోలీసులకు గౌరవం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ నెటిజన్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి నిరక్షరాస్యుల ప్రవర్తనను సహించేది లేదని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఈ ట్వీట్పై మంత్రి కేటీఆర్ సీరియస్గా స్పందిస్తూ.. ఆ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ట్వీట్ చేశారు.
భోలక్పూర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజాము వరకు హోటళ్లు, షాపులు తెరిచి ఉన్నాయి. దీంతో హోటళ్లను, షాపులను మూసి వేయించేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులను భోలక్పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ గౌసుద్దీన్ అడ్డుకున్నారు. వారితో దురుసుగా ప్రవర్తించారు. రంజాన్ మాసం ముగిసే వరకు రాత్రి పూట కూడా హోటళ్లు, షాపులు తెరిచి ఉంటాయని కార్పొరేటర్ చెప్పారు. అయితే.. తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని.. సమయానికి హోటళ్లను మూసివేయాలని పోలీసులు చెప్పబోతే.. మీరు రూ. 100కు పనిచేసే మనుషులని సదరు కార్పొరేటర్ నోరు పారేసుకున్నాడు.
Request @TelanganaDGP Garu to take stern action against the individuals who obstructed police officers on duty
No such nonsense should be tolerated in Telangana irrespective of political affiliations https://t.co/zLbxa8WZW2
— KTR (@KTRTRS) April 6, 2022