KTR | హైదరాబాద్ : కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వమే వస్తది.. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో మన పాత్ర తప్పకుండా ఉంటది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మన్నెగూడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
చేనేత మీద 5 శాతం జీఎస్టీ వేసిన మొట్టమొదటి ప్రధాని మోదీ అని కేటీఆర్ మండిపడ్డారు. చేనేత వద్దు.. అన్ని రద్దు అనేలా కేంద్రం తీరు ఉందని ధ్వజమెత్తారు. కేంద్రం చేనేతకారులపై మరిన్ని భారాలు వేస్తుందన్నారు. చిన్నప్పుడు చేనేతకారుల ఇంట్లో ఉండి సీఎం కేసీఆర్ చదువుకున్నారు. చేనేత కార్మికుల గురించి సీఎం కేసీఆర్కు తెలిసినంత ఎవరికి తెలియదు. సీఎం కేసీఆర్ చేనేతకు చేయూత పథకం తీసుకొచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి నేతన్నల గురించి తెల్వదు అని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తది. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో మన పాత్ర తప్పకుండా ఉంటది. ఎందుకంటే తెలంగాణలో ఇంటిరీయర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు కావాలంటే మన ప్రభుత్వం ఉండాలి. నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కావాలంటే కేంద్రంలో మన పాత్ర ఉండాలి. కేంద్రం నుంచి కూడా అదనంగా డబ్బులు తెచ్చుకోవాలి. వాళ్లు రద్దు చేసిన అన్నింటిని తిరిగి ప్రారంభించాలి. ఎవరైతే మీకు కష్టకాలంలో అండగా ఉన్నారు వారిని తప్పకుండా ఆదరించండి. తప్పకుండా భవిష్యత్లో ప్రభుత్వం మీకు వెన్నంటి నడుస్తుంది రాష్ట్రంలో తిరిగి తప్పకుండా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు. అందులో తనకెలాంటి అనుమానం లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.