నిజామాబాద్: టెక్నాలజీ పరంగా భారత్ ఇంకా వెనుకబడి ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. జనాభాకు తగ్గట్టుగా అభివృద్ధి సాధించడంలో చైనా ఆదర్శమని చెప్పారు. ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని తెలిపారు. నిజామాబాద్లో కాకతీయ స్యాండ్ బాక్స్ ఆధ్వర్యంలో స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ అండ్ స్కేల్ అనే అంశపై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టయిన కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేండ్లలో నిర్మించామని చెప్పారు. టెక్నాలజీ ఫర్ ఇంప్యాక్ట్ పేరుతో స్యాండ్ బాక్స్ సంస్థ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.
లక్ష కిలోమీటర్ల పైప్లైన్ వేసి కోటి ఇండ్లకు మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి ఫైబర్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఐటీ ఎగుమతులు రూ.లక్షా 18 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఐటీ పరిశ్రమను విస్తరించామన్నారు.