KTR | హైదరాబాద్ : కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా 575 టీఎంసీలు దక్కాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చని మోదీకి మహబూబ్నగర్ జిల్లాలో కాలు పెట్టే నైతిక హక్కు కూడా ఆయనకు లేదని కేటీఆర్ పేర్కొన్నారు. అక్టోబర్ 1వ తేదీన పాలమూరు జిల్లా పర్యటనకు వస్తున్న మోదీపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
పాలమూరు వలసల జిల్లా అనే నానుడి ఉంది.. దేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాల్లో ఒకటైన పాలమూరు జిల్లాకు మోదీ ఏం చేయలేదని కేటీఆర్ గుర్తు చేశారు. 2014 జూన్ 2న తెలంగాణ వస్తే జులై 14న ఓ లేఖ తీసుకుని మీ దరగ్గరకు కేసీఆర్ వచ్చారు. నీళ్లలో జరిగిన అన్యాయం గురించి మోదీకి వివరించారు. గోదావరి, కృష్ణా జలాలల్లో మా వాటా తేల్చాలని, అప్పుడే న్యాయబద్దమైన వాటా దక్కుతుందని కోరారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు సహకరించండి, జాతీయ హోదా ఇవ్వాలని కోరాం. కాళేశ్వరం లేదా పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నోసార్లు అడిగాం. కరువులు, కన్నీళ్లు, వలసలతో గోసపడ్డ పాలమూరు ఇప్పుడే పచ్చబడుతుంటే.. ప్రధాన మంత్రి, ఆయన పార్టీ పగబట్టింది. కృష్ణా జలాల్లో వాటా తేల్చకపోగా, మరోవైపు జాతీయ హోదా ఇవ్వలేదు. అప్పర్ భద్రకు, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరును పక్కనపెట్టారు. పాలమూరు గడ్డ మీద కాలుపెట్టే ముందు పాలమూరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి. కృష్ణా జలాల్లో వాటా తేల్చుతామని స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానాన్ని అవలంభిస్తుంది బీజేపీ పార్టీ. అసలు జాతీయ పార్టీనా..? కాదా? స్పష్టం చేయాలి. తెలంగాణ జాతిని దగా చేసిన పార్టీ, ద్రోహం చేసిన దగ్బులాజీ పార్టీ బీజేపీ అని కేటీఆర్ పేర్కొన్నారు.
పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇస్తామని గతంలో బీజేపీ నాయకులు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. పర్యావరణ, ఇతర సాంకేతిక అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేశారు. దీనికి మీరు బాధ్యులు కాదా..? కృష్ణా జలాల్లో వాటా తేల్చమని ట్రైబ్యునల్కు రెఫర్ చేయడానికి ఎందుకు మనసు రావడం లేదు. ఒక్క మాట, ఒక్క సంతకం పెట్టే తీరిక లేదా..? నికృష్ట రాజకీయం ఎందుకు అని మోదీని కేటీఆర్ నిలదీశారు.
రాష్ట్రం వచ్చిన 40 రోజులకే కృష్ణా జలాల కేటాయింపులపై కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రం స్పందించకపోతే ఏడాది వరకు వేచి చూశాం. ఆగస్టు 10, 2015నాడు సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించి న్యాయపోరాటం చేసింది. 2020, అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్లో కేంద్రాన్ని, జలవనరుల శాఖను కేసీఆర్ గట్టిగా నిలదీశారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని అడిగితే.. కేసు ఉపసంహరించుకోమని సూచించారు. కేసు విత్ డ్రా చేసుకున్న తర్వాత.. ఈ రోజు వరకు కనీసం ఉత్తరం రాసిన పాపాన పోలేదు. కృష్ణా జలాల్లో 811 టీఎంసీలను ఉమ్మడికి ఏపీకి బచావత్ ట్రైబ్యునల్ కేటాయించింది. 575 టీఎంసీలు మాకు దక్కాలనేది మా వాదన. ట్రైబ్యునల్కు ఉత్తరం రాయకుండా పాలమూరులో ఎలా అడుగుతపెడుతారని ప్రశ్నించారు. మోదీ నిర్వాకం వల్ల నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు వందల టీఎంసీల నీటిని కోల్పోతున్నాం. ఓట్ల వేట కోసమే మోదీ వస్తున్నారు. ఓట్లు కావాలంటే కూడా చేసిన మంచి పనులు చెప్పాలి. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. ఖాళీ చేతులతో రావడం పోవడం మీకు అలవాటే. వగల ప్రేమలు వలకబోసినా, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినా.. మిమ్మల్ని, మీ పార్టీని నమ్మరు. మళ్లీ డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని చెబుతున్నాను. ఈ సారైనా ప్రధాని స్పందించి, పాప పరిహారం చేసుకుంటారని, ఆ ప్రకాక్షళనలో భాగంగా మాకు న్యాయంగా రావాల్సిన వాటాను ఇవ్వాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు.