KTR | జగిత్యాల : ఎస్సారెస్సీ ఆయకట్టు కింద నీటి యుద్ధాలు లేకుండా చేసింది సీఎం కేసీఆర్ మాత్రమే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలో ఎస్పీ కార్యాలయం, డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
జగిత్యాల నియోజకవర్గంలో వరి పండించే రైతులు ఉన్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒకనాడు ఎస్సారెస్పీ కాలవ మీద నీటి కోసం రైతుల మధ్య యుద్ధాలు జరిగేవి. ఎస్సారెస్సీ కాలవ మీద ఉన్న మోటార్ల వైర్లు కోసి, మోటార్లను కాలవల్లో తోసేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎన్ని మోటార్లు పెట్టినా.. ఎన్నీ నీళ్లు తీసుకున్నా అడగడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు గోస ఉండే. ఆరు గంటల కరెంట్ అన్నరు.. ఒక్కరోజు చక్కగా ఇవ్వలేదు. తెలంగాణలో ఉన్నదంతా చిన్నసన్నకారు రైతులు. మూడు ఎకరాలకు కంటే ఎక్కువ లేదు. వీళ్లకు 24 గంటల కరెంట్ అవసరం లేదు.. మూడు గంటల కరెంట్ చాలు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. అందుకే ఇలాంటి దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ కష్టాలు కావాలంటే కాంగ్రెసోళ్ల గురించి ఆలోచించాలి. 24 గంటల కరెంట్ కావాలంటే రైతు నాయకుడు, రైతుబిడ్డ కేసీఆర్కే ఓటేయాలి అని కేటీఆర్ సూచించారు.
సాగునీటి కోసం జగిత్యాల – కోరుట్ల మధ్య పంచాయితీ, కోరుట్లకు బాల్కొండకు మధ్య, జగిత్యాలకు చొప్పదండికి, పెద్దపల్లికి హుజురాబాద్కు మధ్య పంచాయితీ ఉండేదని కేటీఆర్ గుర్తు చేశారు. రైతులు మొత్తం కాల్వల మీద నిలబడి యుద్ధాలు చేసిన పరిస్థితి. ఇవాళ కాలువల నిండా నీళ్లు పారుతున్నాయి. ఆయకట్టును బ్రహ్మాండంగా కాపాడి నీళ్ల యుద్ధాలు లేకుండా చేశారు కేసీఆర్ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుతాడు.. కానీ కాంగ్రెస్ గెలిస్తే పది మంది ముఖ్యమంత్రులు ఉంటారని కేటీఆర్ తెలిపారు. అలాంటి పార్టీని పొరపాటున కూడా నమ్మొద్దు. 4 లక్షల 25 వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నాం. ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రికి కూడా పెన్షన్లు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? గతంలో బీడీ కార్మికులను ఎవరైనా పట్టించుకున్నారా? కేసీఆర్ వచ్చిన తర్వాతనే బీడీ కార్మికులకు గుర్తింపు వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.