హైదరాబాద్ : ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న ప్రపంచ పర్యాటక సంస్థ.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లిని ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భూదాన్ పోచంపల్లి ప్రజలకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
భారతదేశం నుంచి 3 గ్రామాలు పోటీ పడగా భూదాన్ పోచంపల్లి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. డిసెంబర్ 2వ తేదీన స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 24వ సెషన్లో భూదాన్ పోచంపల్లి గ్రామానికి అవార్డును ప్రదానం చేయనున్నారు. భూదానోద్యమంతో పోచంపల్లికి భూదాన్ పోచంపల్లిగా మారింది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా పోచంపల్లి పేరు సంపాదించింది. పోచంపల్లిలో నేసే ఇక్కత్ చీరలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది.