హైదరాబాద్: బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో ఉంది.. ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉంది.. బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలో ఉందని మంత్రి కేటీఆర్(Minister KTR) విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తలసరి ఆదాయం సహా పలు అంశాల్లో దేశంలోనే తెలంగాణ (Telangana) నంబర్ వన్గా నిలిచిందన్నారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాను అధిగమించామని చెప్పారు. దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారిందన్నారు. హైదరాబాద్ మలక్పేటలో ఐటెక్ న్యూక్లియస్ ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వల్ప కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశామన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
హైదరాబాద్ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. హైదరాబాద్లో అన్ని ప్రాంతాలకు మెట్రో విస్తరిస్తామని చెప్పారు. ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మూసీ ఆధునీకరణ పనులను త్వరలో పూర్తిచేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో గతంలో తరచూ కర్ఫ్యూ పరిస్థితులు ఉండేవన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తొమ్మిదేండ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు.
చిన్నప్పుడు మలక్పేట్ అంటే టీవీ టవర్ అనేవాళ్లని, రాబోయే రోజుల్లో మలక్పేట అంటే ఐటీ టవర్ అంటారన్నారు. 44.20 ఎకరాల్లో ఐటీ టవర్ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అయితే మొదటి విడతగా 10.35 ఎకరాల్లో రూ.1,032 కోట్ల వ్యయంతో 21 అంతస్తులతో 20 లక్షల చదరపు అడుగుల్లో ఐటెక్ న్యూక్లియస్ ఐటీ టవర్ను నిర్మిస్తున్నామని తెలిపారు. 36 నెలల్లోనే ఐటీ టవర్ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని వెల్లడించారు. మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి పెద్దకంపెనీలు ఇక్కడకు తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్లో ఐటీ రంగం దూసుకెళ్తున్నదని చెప్పారు. బెంగళూరు కంటే అధికంగా ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు.
Minister @KTRBRS speaking after laying foundation stone for IT Tower in Malakpet, Hyderabad https://t.co/aAAKVQGArD
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 2, 2023