హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ముందుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇండియాలో టాప్ 10 నగరాలు తెలంగాణ నుంచే ఉన్నాయని చెప్పారు. పేదలకు ఆత్మగౌరవ గృహనిర్మాణం చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. 2021-22 ఏడాదికి పురపాలకశాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరు అడగకున్నా ప్రతి ఏడాది ప్రగతి నివేదిక విడుదల చేస్తున్నామని తెలిపారు. అద్భుతంగా పనిచేస్తున్న మున్సిపల్, పట్టణాభివృద్ధి అధికారులను అభినందించారు. కరోనా కాలంలో మున్సిపల్ సిబ్బంది బాగా పనిచేశారని, కరోనా టీకాలు వేయడంలో మున్సిపల్ సిబ్బంది పాత్ర మరచిపోలేమని మంత్రి అన్నారు.
హైదరాబాద్లో వ్యర్ధ పదార్థాలతో 62 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. అన్ని మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాల శుద్ధీకరణ చేస్తున్నామన్నారు. రూ.100 కోట్లతో అవుటర్ రింగ్రోడ్డు మొత్తం ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. సోలార్ రూఫ్టాప్తో 21 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం కింద రూ.వెయ్యి కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈసారి వరద ముప్పు ఉండదని తాను చెప్పనని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
మూసీనదిపై రూ.540 కోట్లతో 14 బ్రిడ్జిల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. నానక్రామ్గూడ నుంచి టీఎస్పీఏ వరకు సర్వీస్ రోడ్డు విస్తరిస్తున్నామని తెలిపారు. ఉస్మాన్ సాగర్ చుట్టూ 18 ఎకరాల్లో కొత్త పార్కు తుదిదశకు వచ్చిందన్నారు. హెరిటేజ్ భవనాలను అభివృద్ధి చేస్తామన్నారు. రూ.2410 కోట్లతో 104 కొత్త లింక్ రోడ్లను నిర్మించబోతున్నామన్నారు. హైదరాబాద్లో 37 లింక్ రోడ్ల పనుల చేపట్టామని, ఏడు లింక్ రోడ్లను పూర్తిచేశామన్నారు. మిగతావి తుదిదశలో ఉన్నాయని చెప్పారు. ఉప్పల్, మెహిదీపట్నంలో స్కైవాక్లు నిర్మిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలతోపాటు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ప్రత్యేక దృష్టితో పట్టణాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. లాక్డౌన్ సమయంలో రోడ్లు, నాలాలు, ఫ్లై ఓవర్లు నిర్మించుకున్నామన్నారు.
141 మున్సిపాలిటీల్లో రూ.3700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి నెలా మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. అన్ని పట్టణాల్లో టెన్ పాయింట్ ఎజెండాతో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి జిల్లాకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టు ఉందన్నారు. త్వరలో 50 వేల జనాభా ఉన్న ప్రతి మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈడాది అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని వెల్లడించారు.
తమిళనాడు, కేరళ తర్వాత తెలంగాణలో 46.8 శాతం మంది పట్టణాల్లోనే ఉంటున్నారని చెప్పారు. 3 శాతం భూభాగంలో 46.8 శాతం జనాభా ఉన్నదని వెల్లడించారు. 2050 నాటికి 50 శాతం జనాభా పట్టణాల్లో ఉంటుందని నీతి ఆయోగ్ చెప్పిందన్నారు. నాలుగైదేండ్లలో 50 శాతం తెలంగాణ జనాభా పట్టణాల్లో ఉండబోతున్నదని పేర్కొన్నారు.
హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాల్లో 142 శాతం వృద్ధి నమోదయిందన్నారు. నిర్మాణం ప్రారంభించిన తర్వాత 26 నెలల్లోనే ఇండ్ల అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. 2254 శానిటేషన్ వెహికిల్స్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. 103 వెజ్, నాన్వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేశామన్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ హైదరాబాద్లోనే ఉందన్నారు. రూ.3800 కోట్లతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.