హైదరాబాద్ : తెలంగాణలో అమిత్షా పర్యటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కుటుంబ పాలనపై అమిత్షా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘పూర్తిగా మెరిట్ ఆధారంగా ర్యాంకులను సాధించి బీసీసీఐ సెక్రెటరీగా ఎదిగిన ఓ కుమారుడి తండ్రి తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఇక ఆ తండ్రి.. సౌమ్యుడి కోసం ప్రచారం చేస్తున్నారు. అన్న ఎంపీగా పదవిలో కొనసాగుతుండగా, భార్య ఎమ్మెల్సీగా పోటీ చేసిన వ్యక్తి తరఫున ప్రచారం చేయడానికి వచ్చారు. అలాంటి తండ్రి.. కుటుంబ పాలన రద్దు చేయాల్సిన అవసరంపై మనకు హితబోధ చేస్తారు’ అంటూ కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.