హైదరాబాద్ : భవన నిర్మాణం, లే అవుట్ అనుమతులకు సంబంధించి టీఎస్ బీ-పాస్ను సైతం దేశంలోనే ఆదర్శవంతమైన ఓ వ్యవస్థగా మార్చాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు మున్సిపల్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. టీయూఎఫ్డీసీ ద్వారా వివిధ పురపాలికల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పురోగతిపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పట్టణాల రూపురేఖలను సమగ్రంగా మార్చేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని, ఈ దిశగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కార్యక్రమానికి ప్రతి నెలా పురపాలికలకు ప్రత్యేకంగా నిధులను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రగతికి అదనంగా టీయూఎఫ్ఐడీసీ సంస్థను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మునిసిపాలిటీలకు నిధులను అందజేస్తుందని, తద్వారా ఆయా పట్టణాల్లో పౌర, మౌలిక సదుపాయాలు వేగంగా ఏర్పాటు చేయగలుగుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ బీ-పాస్ విధానం క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరుపై కేటీఆర్ సమీక్షించారు. టీఎస్ బీ-పాస్ తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ క్రమంగా దాన్ని బలోపేతం చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం టీఎస్ బీ-పాస్ను పౌరులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారని, గణాంకాలతో సహా వివరించారు. టీఎస్ బీ-పాస్కు సంబంధించి అనుమతుల జారీ ప్రక్రియలో గతంలో ఉన్న ఆలస్యం పెద్ద ఎత్తున తగ్గిందంటూ ఈ సందర్భంగా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు రూపొందించిన టీఎస్ బీ-పాస్ చట్టంలో పేర్కొన్న అన్ని రకాల సౌకర్యాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పురపాలక శాఖ పని చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆదేశించారు. టీఎస్ బీ-పాస్ వచ్చిన తర్వాత అనుమతుల ప్రక్రియ గతం కంటే సులభం అయిందన్నారు. టీఎస్ బీ-పాస్ ను ప్రజల వద్దకు మరింతగా చేర్చేలా అవసరమైన వెబ్సైట్స్లో మార్పులను చేయడం, ప్రజల ఫిర్యాదులకు సంబంధించి మరింత వేగంగా రెస్పాన్స్ ఇచ్చే విధంగా ప్రస్తుతం ఉన్న ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయడం, టీఎస్ బీ-పాస్ టోల్ ఫ్రీ నంబర్కు మరింత ప్రచారం కల్పించడం తదితర చర్యలను చేపట్టాలని కేటీఆర్ అధికారులకు సూచించారు.
సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల పురపాలక శాఖ తరఫున కొనసాగిస్తున్న తాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్ష నిర్వహించారు. దీంతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన ఎస్ఆర్డీపీ వంటి అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. ఈ వారంలోనే ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన మరో రెండు కీలకమైన ఫ్లైఓవర్లను ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
అలాగే రాష్ట్రంలోని పురపాలికల మాస్టర్ ప్లాన్ తయారీపై కేటీఆర్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ల తయారీ ప్రక్రియ ఇప్పటికే అనేక పురపాలికలు, అన్ని కార్పొరేషన్లలో పూర్తయిందని, కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో ప్లాన్లను సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశంలో పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ, జలమండలి, టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.