KTR | హైదరాబాద్ : మతం పేరిట మంటలు పెట్టి.. గురుగ్రామ్ లాంటి గొప్ప ఐటీ సెంటర్ను నాశనం చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణలో మతాల పంచాయతీ లేదు, కులాల మధ్య కొట్లాట లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ ఉండటం వల్లే అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. దేశంలో ఉన్న ఐటీ పురోగతితో పోలిస్తే.. మన ఐటీ పురోగతి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది.
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ పురోగతులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంటా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఐటీని తామే అభివృద్ధి చేశామని కొంతమంది చెప్పుకుంటారు. కానీ మేం అలా చెప్పుకోం. హైదరాబాద్లో 1987లోనే తొలిసారిగా ఐటీ కంపెనీ ప్రారంభమైంది. బేగంపేటలోని ఇంటర్ గ్రాఫ్ సంస్థ.. అది మొట్టమొదటి ఐటీ భవనం. 1987 నుంచి 27 ఏండ్లలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు 56 వేల కోట్లు ఉంటే.. ఒక్క గతేడాదే రూ. 57 వేల కోట్లు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
నిన్న కోకాపేట భూములకు వేలం నిర్వహిస్తే ఎకరం భూమి ధర రూ. 100 కోట్లు పలికింది. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆ కుంభకోణం అని, ఈ లంబకోణం అని, ధరణిలో ఏమో జరిగిపోయిందని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ అన్ని రికార్డులు బద్దలుకొడుతూ, అన్ని అనుమానాలను చెరిపేస్తూ ఒక్కొక్క ఎకరం రూ. 100 కోట్లు పలికే పరిస్థితి వచ్చింది. ఊరికేనే డైలాగులు కొడితేనో, బయటపోయి ధర్నాలు చేస్తేనో ఇలాంటివి జరగవు. రాష్ట్రంలో అద్భుతమైన పురోగతి జరుగుతోంది. దీనికి రెండు కీలకమైన అంశాలు అవసరం. అవి స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్. రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండి, దక్షత కలిగిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండట వల్లే రాష్ట్రంలో పురోగతి ఉంది. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష. ఇవాళ హర్యానాలో ఏమవుతుంది.. గురుగ్రామ్ గొప్ప ఐటీ సెంటర్.. దాన్ని అక్కడున్న వారు నాశనం చేస్తున్నారు. అక్కడ కూడా పనికిమాలిన మతం పేరు మీద పంచాయతీలు పెట్టి.. గబ్బులేపి ఉన్నవారిని పారిపోయే విధంగా దరిద్రపు కార్యక్రమాలు చేస్తున్నారు. మణిపూర్లో ఏం జరుగుతోంది. మతాల పేరు మంటలు సృష్టిస్తున్నారు. దేశంలోని ఐటీ పురోగతి కంటే.. మన రాష్ట్రంలోని ఐటీ పురోగతి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. దీనికి కారణం స్టేబుల్ గవర్నమెంట్.. ఏబుల్ లీడర్షిప్ మాత్రమే అని కేటీఆర్ మరోమారు స్పష్టం చేశారు.
కొత్త రాష్ట్రం వచ్చాక 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలను విస్తరిస్తోంది. ఇప్పటికే చాలా నగరాల్లో ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయని తెలిపారు. పట్టణాలు, నగరాలు ఎదగాలంటే పరిశ్రమలను ఆకర్షించాలి. ప్రతిచోటా అంతర్జాతీయ ప్రమాణాలను తట్టుకొని నిలబడాలి. దేశంలో మొత్తం సృష్టించిన టెక్నాలజీ జాబ్స్లో 44 శాతం తెలంగాణవే అని కేటీఆర్ పేర్కొన్నారు.