Minister KTR | మంచిర్యాల/ కరీంనగర్ అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కేసీఆర్ అంటే నమ్మకం.. మోదీ అంటే అమ్మకం’ అని మునిసిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అదానీ అనే దోస్తు కోసం సింగరేణిని తీసుకుపోయి తాకట్టుపెట్టాలని చూస్తున్నాడని, బొగ్గు గనుల్ని వారికి రాసిచ్చి సింగరేణిని నాశనం చేయాలన్న ఆలోచన ఒక్కటే తప్ప మోదీ మదిలో తెలంగాణ లేనే లేదని విరుచుకుపడ్డారు. ప్రధాని తన పేరును అదానీగా మార్చుకోవాలని సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీల పర్యటనలో భాగంగా నిర్వహించిన రోడ్షో, బహిరంగసభ.. గోదావరిఖనిలో జరిగిన రామగుండం దశాబ్ది ప్రగతి సభ, పెద్దపల్లిలో జరిగిన ప్రగతి నివేదన సభల్లో పాల్గొని ప్రసంగించారు. “ప్రధాని మోదీ తెలంగాణకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నడో మాకైతే అర్థం కావడం లేదు. ఆయనొచ్చింది ఓట్ల కోసమే. అప్పట్లో అమరావతికి పోయి తట్టెడు మట్టి.. లొట్టెడు నీళ్లు ఇచ్చిండు. తెలంగాణ కొంగుబంగారం సింగరేణిని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు.
రామగుండం వచ్చినప్పుడు సింగరేణిని కాపాడతానని చెప్పినోడు నెల రోజుల్లోపే నాలుగు గనుల ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచాడు. కేసీఆర్ రుణమాఫీ చేస్తామని మాట తప్పిండని, అందుకే తెలంగాణ రైతులు చచ్చిపోయిండ్రని ప్రధాని మాట్లాడిండు. నేను ప్రధానమంత్రిని అడుగుతున్న. నీకు కనీస ఇంగితం ఉంటే, నిజంగా ప్రధానివి అయితే వెంటనే మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం. వాస్తవం ఏమిటంటే.. కరోనా కష్టమొచ్చినా రెండుసార్లు రైతులకు రూ.37 వేల కోట్లను రుణమాఫీ చేసిన దేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. వాస్తవాలను విస్మరించి ప్రధాని హోదాలో పచ్చి అబద్ధాలు చెప్పొచ్చా. మోదీ వచ్చిన ప్రతిసారీ మరో మాట చెపుతుండు. కేసీఆర్ కుటుంబ పాలన తెలంగాణలో ఉందంటున్నారు. బరాబర్ చెపుతున్నాం.. మాది కుటుంబ పాలనే. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులే. మా అందరి కుటుంబ పెద్ద కేసీఆర్.
రాష్ట్రంలోని 13 లక్షల మంది అడపిల్లల పెళ్లి చేసిన మేనమామ కేసీఆర్. రాష్ట్రంలోని 46 లక్షల మందికి పెన్షన్ ఇస్తూ పెద్దకొడుకుగా నిలిచింది కేసీఆర్.. రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చి వాళ్లకు సోదరుడిగా నిలబడింది కేసీఆర్. తెలంగాణలో ప్రతి కుటుంబలో కేసీఆర్ ఒక సభ్యుడు. నీవు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా.. నీ బీజేపీకి డిపాజిట్లు దక్కవు. అయ్యా, ప్రధాని గారు దేశంలోని రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలని, ఇందుకు ఆయ్యే ఖర్చు మొత్తం లక్షా నలభై ఐదు వేల కోట్లు మాత్రమే అని చెప్పాం. దీనిపై ప్రధాని ఏమన్నారంటే.. ఉచితం కరెక్టు కాదు.. అట్లజేసుడు మంచిది కాదంటూ సుద్దపూస లెక్క మాట్లాడిండు. మేము కూడా నిజమే అనుకున్నం. లక్షా నలభైఐదు వేల కోట్లు దేశంలోని రైతులకు ఉచిత విద్యుత్తు పేర ఇవ్వడానికి ఆసక్తి చూపకుండా.. దోస్తులకు మాత్రం పద్నాలుగున్నర లక్షల కోట్లు మాఫీ జేసిన దుర్మార్గపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
మోదీ కాదు మొండి.. మొండి కాదు తొండి
మందమర్రిని డీ-నోటిఫై చేసి మున్సిపల్ ఎన్నికలు జరిపించాలనే అంశంపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నిజానికి ఈ అంశం మన చేతుల్లో ఉంటే ఈపాటికి మందమర్రిలో ఒక ఎన్నిక కాదు.. రెండు ఎన్నికలు అయిపోతుండే అని అన్నారు. “దురదృష్టం ఏంటంటే ఆ ఢిల్లీలో ఉన్న ప్రధాని మోదీ.. ఆయన మోదీ కాదు మొండి.. మొండి కూడా కాదు తొండి.. మనం ఎన్ని చెప్పినా వినడు.. ప్రజలకు పనికి వచ్చే పనులు చెప్పినా వినడు.. మా సింగరేణి కార్మికులకు పనికొచ్చే పనిచెప్పినా వినడు” అని ధ్వజమెత్తారు. ఈసారి కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, ఒక్కొక్క ఎంపీ మనకు కీలకం అవుతారని పేర్కొన్నారు. మన ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించుకొని ఆ ఢిల్లీ జుట్టు మన చేతిలో పెట్టుకొని సింగరేణిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. మంచిర్యాల సభల్లో ఎంపీ వెంకటేశ్ నేత, స్థానిక చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. గోదావరిఖని, పెద్దపల్లి సభల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేత తో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అంటే స్కీమ్లు.. కాంగ్రెస్ అంటే స్కామ్లు.. బీఆర్ఎస్ అంటే తాగు, సాగునీరు.. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు. అందుకే ఎటు దిక్కు ఉంటారో ఆలోచించండి. రైతుబంధు ఇచ్చి పంట వేసే టైం అయ్యిందంటే.. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగ్, టింగ్మనుకుంటా రూ.73 వేల కోట్లు వేసిన రైతుబంధు కేసీఆర్ వైపు ఉందామా.. ఆరు దశాబ్దాలపాటు మనల్ని చావగొట్టి తాగునీరు, కరెంట్ ఇవ్వకుండా పీక్కతిన్న రాబందు కాంగ్రెస్ వైపు ఉందామా..? రైతుబంధు కేసీఆర్ కావాలా.. రాబందు కాంగ్రెస్ కావాలా?
– మంత్రి కేటీఆర్
అటు బీజేపీ అయినా, ఇటు
కాంగ్రెస్ అయినా.. వాళ్లకు కడుపు నొప్పి ఉండది. కష్టపడి సాధించుకున్న ఈ తెలంగాణ మీద వాళ్లకు ప్రేమ ఎన్నటికీ ఉండది. మళ్లీ ఎన్నటికైనా ఈ గులాబీ జెండానే.. మన కేసీఆర్ నాయకత్వమే మనకు శ్రీరామరక్ష. తప్పకుండా కేసీఆర్ను గెలిపించుకుందాం.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఈ రాష్ట్రంలోని పేదలు, రైతులు, బడుగులు అందరి గొంతుకై ముందుకు తీసుకుపోతున్న కేసీఆర్ను కండ్లలో పెట్టుకొని కాపాడుకుందాం.. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టిద్దాం.
– మంత్రి కేటీఆర్