హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు వీరోచిత పోరాటం చేశారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. విద్యార్థులంతా వీరోచిత పోరాటం చేసిన సమయంలో ఇప్పుడు టీ బీజేపీ, టీ కాంగ్రెస్ పేరిట పదవులు అనుభవిస్తున్న వారు ఎక్కడా కనబడలేదని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ రాక ముందు మీరంతా ఉస్మానియా, పాలమూరు, కాకతీయ, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో వీరోచితంగా పోరాటం చేసిన సమయంలో ఈ బఫూన్ ఎక్కడా కనబడలేదు. కేసీఆర్ లేకపోతే టీఆర్ఎస్ లేదు. టీఆర్ఎస్ లేకపోతే ఈ దఫా తెలంగాణ ఉద్యమం లేదు. ఉద్యమంలో మీరంతా లేకపోతే తెలంగాణ వచ్చుడే లేదు. ఈ తెలంగాణ రాకపోతే టీ బీజేపీ, టీ కాంగ్రెస్ ఉండేవి కావు. మీరు పెట్టిన భిక్షనే ఆ పదవులు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇప్పుడున్న నాయకులు ఎంత చిల్లర అంటే నవ్వాలో, ఏడ్వాల్నో కూడా తెల్వదని కేటీఆర్ అన్నారు. నిజంగా కొట్లాడుదామంటే ఇది వరకు మనకు మంచిగా ఉండే. మనకు ప్రత్యర్థులు మంచిగా ఉండే. చంద్రబాబు, రాజశేఖర్ ఉండే. వారితో కొట్లాడిన గమ్మత్తు ఉండే. వాళ్లు కూడా ఒక స్థాయి లీడర్లుకాబట్టి. వారితో ఓ మాట అన్న, ఓ మాట పడ్డ ఒక పద్ధతి ఉండే. ఇప్పుడు ఉన్న వారితో అయితే ఆగం ఉంది. ఎలాంటి బఫూన్ గాళ్లను మనకు తగిలించారంటే. కొట్లాట చేత కాదు. మాట్లాడటం చేత కాదు. తెలంగాణకు ఒక్క రూపాయి తెచ్చే తెలివి లేదు. సొంత పార్లమెంట్లో అర పైసా పని కూడా చేయలేదు. ఎంత చిల్లర రాజకీయం అంటే.. కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తుండట. నల్ల పిల్లిని ముందు పెట్టుకొని పూజ చేస్తున్నాడని ఆ బఫూన్ మాట్లాడుతుంటే నవ్వు వస్తుందని కేటీఆర్ అన్నారు.