హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. హరీశ్రావు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతం అవుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి ఎంత ప్రాధ్యానత ఇస్తుందో ఈ చిత్రాలను చూస్తే అర్థమవుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అభివృద్ధికి నోచుకోలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు ఈ ఫోటోలే నిదర్శనం అని ఆయన స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ బాలానగర్, కోయిల్కొండ లోని ప్రభుత్వ ఆస్పత్రుల ఫోటోలను తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. మంత్రి హరీశ్రావుతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని కూడా కేటీఆర్ అభినందించారు.
మంగళవారం మంత్రి హరీశ్రావు పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి మహబూబ్నగర్ జిల్లా బాలానగర్, కోయిలకొండలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ప్రారంభించడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రెండు కోట్ల కరోనా టెస్టింగ్ పరికరాలు, కోటి హోం ఐసొలేషన్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఏఎన్ఎం, సబ్సెంటర్, పీహెచ్సీ, సీహెచ్సీ, జిల్లా, జనరల్ దవాఖానల్లో ఎక్కడైనా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో ఇచ్చే మందులు వారం రోజులు వాడితే కరోనా తగ్గిపోతుందని, ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని అన్నారు. ఇటీవల వ్యాక్సిన్ వేసేందుకు స్కూటీ మీద వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఎన్ఎం కుటుంబసభ్యులకు త్వరలోనే రూ.50 లక్షల బీమా చెక్కును అందజేస్తామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినప్పటికీ, తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 17 వైద్య కళాశాలలు మంజూరుచేశారని, ఈ విద్యా సంవత్సరంలో 8 కాలేజీలు ప్రారంభిస్తామని చెప్పారు. జాతీయ రహదారిపై ఉన్న బాలానగర్లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.