KTR | కరీంనగర్ : మంత్రి గంగుల కమలాకర్ మీద పోటీ అంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగులను భారీ మెజార్టీతో గెలిపించి, మరోసారి తెలంగాణలో కేసీఆర్కు అవకాశం ఇవ్వాలని మంత్రి కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని కేటీఆర్ తెలిపారు. మానేరు నీళ్లకోసం జరిగిన కొట్లాటలు ఇంక కళ్లముందే ఉన్నాయి. నేడు ఆ పరిస్థితి లేదు. కాళేశ్వరంతో కరీంనగర్ జిల్లా అంత సజీవ జలధారగా మారిందన్నారు. అభివృద్ధికి తోడు సంక్షేమం ధీటుగా సాగుతుందన్నారు. కమలాకర్ నాయకత్వంలో బీసీ సంక్షేమం అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలిపారు. చదువుకునేందుకు గురుకులాలు, విదేశాలకు పోయేవాళ్ళకి కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించి అండగా నిలబడ్డామని చెప్పారు.
హిందూ, ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టే సన్నాసులు కరీంనగర్లో ఉన్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కమలాకర్ చేతిలో చావు దెబ్బ తిని దొంగ ఏడుపుతో ఎంపీ అయ్యారని విమర్శించారు. ఎంపీ అయ్యాక కరీంనగర్కు ఏం చేశారు. ఓ బడి తేలేదు… కనీసం గుడి అయినా తేలేదని మండిపడ్డారు. కమలాకర్ అన్నపై పోటీ చేసేందుకు అందరూ జంకుతున్నారు. కాంగ్రెస్ వాళ్లు హుస్నాబాద్ పారిపోయారు.. బీజేపీ వాళ్ళు పోటీకి వెనుక ముందు అవుతున్నారు. కేసీఆర్ అందరి నాయకుడు.. హిందూ, ముస్లింలకు అందరికీ నేత అని స్పష్టం చేశారు. కేసీఆర్ అందరి కంటే గొప్ప హిందువు.. యాగాలు, యజ్ఞాలు చేశారని తెలిపారు.
ఇక్కడ ఎంపీ మసీదులు తవ్వుదాం అంటాడు… బొందల గడ్డలు తవ్వడానికా ఎంపీ అయింది సంజయ్ అని కేటీఆర్ నిలదీశారు. పునాదులు తవ్వండి.. అభివృద్ధి కోసం పునాదులు వేయండి అని పిలుపునిచ్చారు. చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ ఒకవైపు… తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన బీజేపీ కిషన్ రెడ్డి, ఓటుకు నోటు దొంగ థర్డ్ క్లాస్ క్రిమినల్ రేవంత్ రెడ్డి మరోవైపు ఉన్నారని కేటీఆర్ తెలిపారు. రాహుల్ వస్తాడు.. ప్రియాంక వస్తుంది.. మోసపోకండి… కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ని దీవించండి అని కరీంనగర్ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.