హైదరాబాద్ : శంషాబాద్లో శాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఐ ఫెసిలిటీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. రూ. 1200 కోట్ల పెట్టుబడితో ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఎంఆర్ఐ ఫెసిలిటీ సెంటర్ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
రూ.1,200 కోట్ల (15 కోట్ల అమెరికన్ డాలర్ల) పెట్టుబడితో విమాన ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు శాఫ్రాన్ సిద్ధమైంది. ఈ నిర్ణయంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ నిన్న ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్కు తిరుగులేదని ఈ నిర్ణయంతో మరోసారి రుజువైందన్నారు. శాఫ్రాన్ సంస్థకు చెందిన అతిపెద్ద ఎమ్మార్వో కేంద్రం ఇదేనని, మన దేశంలో ఓ విదేశీ సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి ఇంజిన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదేనని తెలిపారు. దీని ద్వారా దాదాపు 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. వాణిజ్య విమానాల్లో ఉపయోగించే లీప్-1ఏ, లీప్-1బీ ఇంజిన్ల నిర్వహణకు ఏర్పాటు చేయనున్న శాఫ్రాన్ ఎమ్మార్వో కేంద్రంతో తెలంగాణలోని ఏవియేషన్ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుందని చెప్పారు.