సంగారెడ్డి : రాష్ట్రంలోని మహిళా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తామని, వారు ఎదగడానికి సహకారం అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని రకాల తోడ్పాటును అందిస్తుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సుల్తాన్పూర్లో మహిళా పారిశ్రామిక పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసిన ఫ్లో ఇండస్ట్రియల్ పార్క్ పైలాన్ను కేటీఆర్ ఆవిష్కరించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటైన ఏకైక కేంద్రం వీ హబ్ అని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో ఏర్పాటైన వీ హబ్కు సీఈవోగా దీప్తి ఉన్నారు. వీ హబ్ సందర్శించి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. వీ హబ్ ఇప్పటికే 2,194 స్టార్టప్లను రూపకల్పన చేసింది. ఇందు కోసం రూ. 66.3 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. స్టార్టప్ నిధులతో 2,800 మందికి ఉపాధి కల్పన సృష్టించామని పేర్కొన్నారు.
దేశంలో తొలిసారి మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఉద్యామిక అనే కొత్త కార్యక్రమం చేపట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. వారి ఫిర్యాదులను కూడా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఉద్యామికలో భాగంగా సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ ద్వారా ప్రాసెస్, రివ్యూ, ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. సులభతర వాణిజ్యానికి కార్పస్ ఫండ్ ఏర్పాటు కావాలన్నారు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులతో పురోభివృద్ధి సాధించాలని ఆశిస్తున్నాను అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతి ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 18 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు. ప్రయివేటు రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగ కల్పన కల్పించామన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు అందించే కేంద్రంగా హైదరాబాద్ మారిందన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, హెల్త్ కేర్ రంగంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ఫార్మాస్యూటికల్ ఆఫ్ ఇండియాగా మారిందని కేటీఆర్ తెలిపారు.