హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇన్క్రిమెంటల్ ఇన్నోవేషన్ కీలకమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. స్టార్టప్ ఇంక్యుబెటర్ టీ హబ్ ఏడో వార్షికోత్సవ వేడుకలు శనివారం జరిగాయి. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్డీపీ ప్రస్తుతం రూ.11.55లక్షల కోట్లకు చేరుకుందని, ఇది 2014లో దాదాపు రూ.5.06లక్షల కోట్లుగా ఉండేదన్నారు. ప్రస్తుతం 11 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరో నాలుగుశాతం వృద్ధిని సాధిస్తే నాలుగు నుంచి ఐదేళ్లలో రూ.30లక్షల కోట్లకు జీఎస్డీపీ చేరుకుంటుందన్నారు. ఇందుకు ఇన్క్రిమెంటల్ ఇన్నోవేషన్ కీలకమన్నారు. టీ-హబ్ స్టార్టప్ కమ్యూనిటీ కోసం మంచి ప్లాట్ఫామ్ను సృష్టించిందన్నారు. దీన్ని అనేక రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయని, గోవాలో ఏర్పాటుకు ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. మరో ఎనిమిది రాష్ట్రలు ఆయా రాష్ట్రాల్లో టీ-హబ్ తరహాలో ఏర్పాటుకు ఆసక్తిని వ్యక్తం చేశాయన్నారు.
టీ-హబ్ మెంటర్షిప్, మనీ, మార్కెట్ యాక్సెస్, మోటివేషన్, మైండ్సెట్, మ్యాన్పవర్, పార్ట్నర్షిప్లు, పాలసీ అడ్వైజరీపై దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుత సదుపాయం మొత్తం 5,82,689 చదరపు అడుగుల విస్తీర్ణంతో 2వేల స్టార్టప్లకు ఒకే పైకప్పు కింద మద్దతును ఇస్తుందన్న కేటీఆర్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్గా మారిందని హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ను అన్ని వస్తువుల స్టార్టప్లకు అనువైన ప్రదేశంగా మార్చేందుకు ప్రయత్నాలు చేయాలని, హైదరాబాద్ సిలికాన్ వ్యాలీకి సమానం కావాలన్నారు. టీ హబ్లో ఉండడం ఆనందంగా ఉందని, దాని విజయంపట్ల చాలా గర్వపడుతున్నానన్నారు. టీ హబ్ ఎదుగుదలను చూస్తే పిల్లవాడి ఎదుగుదలను చూస్తున్నట్లుగా ఉందన్నారు. కార్యక్రమంలో ఐటీ సెక్రెటరీ జయేశ్ రంజన్, టీ హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.