తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా తెలంగాణ సర్కారు అందిస్తున్న ఉద్యోగ అర్హత , నైపుణ్యాల అభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో ఉచిత శిక్షణ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, టాస్క్ సిరిసిల్ల సెంటర్లో కొత్తగా ఎనిమిది కోర్సుల్లో శిక్షణనిచ్చేందుకు నిర్ణయించామని చెప్పారు.
ఈ సారి హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ అండ్ ఎస్సీఎం, బ్యాంకింగ్ పరీక్ష తయారీ, టాలీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్, పైథాన్ ప్రోగ్రామింగ్, డేటాబేస్ అండ్ ఎస్క్యూఎల్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, క్లౌడ్ ఫండమెంటల్స్లో శిక్షణనిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. జిల్లాలో వచ్చే ఆరు నెలల్లో రెండు వేల మందికి శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. స్కిల్, రీ స్కిల్, అప్ స్కిల్ ద్వారా ఎంచుకున్న రంగాల్లో రాణించొచ్చని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఎనిమిదేళ్లలో లక్షా 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. కొత్తగా 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు.
ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంపొందించుకుంటే ప్రైవేట్ రంగంలో విస్తృత అవకాశాలుంటాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలను కల్పించామన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 16 లక్షలపైచిలుకు ఉద్యోగాలు సృష్టించినట్లు వెల్లడించారు.
95 శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పించేందుకు సీఎం కేసీఆర్ కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పారు. త్వరలోనే టాస్క్లో ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మత్స్య, టెక్స్టైల్, పుడ్ పరిశ్రమ రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయని పేర్కొన్నారు. టాస్క్ శిక్షణను సద్వినియోగం చేసుకొని, జీవితంలో ఉన్నతంగా ఎదుగాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.