హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ), మహేశ్వరం: ప్రతి 14 సెకన్లకు ఒక టీవీ తయారు చేసే సామర్థ్యంతో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ రేడియంట్ రాష్ట్రంలో తన రెండో యూనిట్ను ప్రారంభించింది. దీనితో దేశంలో 25 శాతం టెలివిజన్లు హైదరాబాద్లోనే తయారు కానున్నాయి. ఇప్పటివరకు ఉన్న యూనిట్ ద్వారా ఏడాదికి 21 లక్షల టెలివిజన్ల తయారీ సామర్థ్యం ఉన్న రేడియంట్ సంస్థ.. కొత్త యూనిట్ ప్రారంభించడం ద్వారా ఏడాదికి 45 లక్షల టీవీలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచుకొన్నది. శ్యాంసంగ్, వన్ప్లస్, పానసోనిక్, అమెజాన్, స్కైవర్త్, నోకియా, మోటరోలా తదితర సంస్థల ఉత్పత్తులను రేడియంట్ తయారు చేస్తుంది. సోమవారం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాలలోని ఈ-సిటీలో రేడియంట్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే పదేండ్లలో దాదాపు 16 లక్షల మందికి ఉపాధి కల్పనతోపాటు.. ఏటా రూ.2.5 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం లక్ష్యంగా పెట్టుకొన్నామని తెలిపారు. ఉత్పాదక సంస్థలు వాటి కార్యక్రమాలను విస్తరించాలని కోరారు. ఇందుకు ప్రభుత్వం తగిన సౌకర్యాల కల్పనకు సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ఎలక్ట్రానిక్ సిటీలో ప్రస్తుతం 15 వేల మంది పనిచేస్తున్నారని.. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్య 40 వేలకు చేరుకొంటుందన్నారు. ‘రాష్ట్రం పరిశ్రమలకు,ఇతర వినియోగదారులకు 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేస్తున్నది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు ముఖ్యమైంది నాణ్యమైన విద్యుత్తు సరఫరా. కరెంటు రాకపోతే ఉత్పత్తి లోపిస్తుంది. దీనివల్ల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఏటా 45 లక్షల టీవీల ఉత్పత్తి
ఉత్పాదక రంగాన్ని కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకుండా.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పెద్ద ఎత్తున పరిశ్రమల పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం, సమర్థమైన నాయకత్వం ఉన్నందున ఇప్పటికే రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని పేర్కొన్నారు. ఉత్పాదక రంగాన్ని హైదరాబాద్ బయట ఇతర ప్రాంతాల్లో విస్తరించడానికి స్థలాల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో రేడియంట్ సంస్థ వివిధ బ్రాండ్లకు టెలివిజన్లు తయారు చేస్తున్నదని వెల్లడించారు. శ్యాంసంగ్, వన్ప్లస్, పానసోనిక్, అమెజాన్, స్కైవర్త్, నోకియా, మోటరోలా సంస్థల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం ప్రతి 14 సెకండ్లకు ఒక టీవీ తయారు చేస్తున్నదని తెలిపారు. దేశంలో 25 శాతం టెలివిజన్లు హైదరాబాద్లోనే తయారవుతున్నాయని పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఉన్న యూనిట్ ద్వారా ఏడాదికి 21 లక్షల టెలివిజన్ల తయారీ సామ ర్థ్యం ఉన్న రేడియంట్ సంస్థ.. కొత్త యూనిట్ ప్రారంభించడం ద్వారా ఏడాదికి 45 లక్షల టీవీలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచుకొన్నదన్నారు. ఇప్పటివరకు కంపెనీ రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టిందని వివరించారు. రేడియంట్ తెలంగాణలో ప్రారంభించినప్పటినుంచి యాభై లక్షల టీవీలను తయారు చేయడం గర్వంగా ఉన్నదని తెలిపారు. ఇప్పటికే 2,800 మందికి ఉద్యోగాలు కల్పించిన ఈ సంస్థ అదనంగా మరో వెయ్యి మందికి ఉద్యోగాలిచ్చిందని.. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,800కు చేరిందని తెలిపారు. మరో 1,500 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. తెలంగాణలో అనుకూల వాతావరణం, శిక్షణ కలిగిన మానవవనరుల వల్ల తమ వ్యాపారం బాగా కొనసాగుతుందని.. 35 రెట్లు రెవెన్యూ పెరిగే అవకాశమున్నదని కంపెనీ యాజమాన్యం చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ బయటా తయారీరంగం
రేడియంట్ అధిపతి మణికందన్ ఏడేండ్ల క్రితం తనను కలిసినప్పుడు మేడ్చల్లో ఒక యూనిట్ ఉన్నట్టు, ప్రభుత్వం సహకరిస్తే తాను ఒక పెద్ద టీవీల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తానని చెప్పిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకొన్నారు. మణికందన్ విజ్ఞప్తిమేరకు ఈ-సిటీలో స్థలం కేటాయించామన్నారు. తయారీ రంగాన్ని హైదరాబాద్ చుట్టూనే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు భూముల గుర్తింపు ప్రక్రియ జరుగుతుందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, కొత్తతరం వాళ్లు కంపెనీల ఏర్పాటునకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 180 కోట్ల పన్నులు రేడియంట్ సంస్థ ప్రభుత్వానికి చెల్లించిందని తెలిపారు. ఈ సందర్భంగా రేడియంట్ కంపెనీ తెలంగాణలో ఉత్పత్తి చేసిన 50వ లక్ష టెలివిజన్ను కేటీఆర్కు బహుమానంగా అందించింది.
ఉద్యోగాల కల్పనకు చర్యలు…
ఐటీ, ఐటీఈ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కేటీఆర్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ చదువుకున్న యువకులకు మంచి అవకాశమున్నదని పేర్కొన్నారు. శేరిలింగంపల్లిలో ఇటీవలే 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గూగుల్ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. తెలంగాణలో సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ తదితర అన్ని రంగాలతో కూడిన బహుముఖ అభివృద్ధితో దూసుకుపోతున్నామని తెలిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రేడియంట్ కంపెనీలో 60 శాతం మంది స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు ఇస్తుండటంపై సంతోషం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, రేడియంట్ కంపెనీ డైరెక్టర్ మణికందన్, ఎండీ రమీందర్ సింగ్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.