హైదరాబాద్ : ఫ్రాన్స్లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతున్నది. గురువారం పలు కంపెనీల సీఈవోలు, పరిశ్రమల అధిపతులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మిస్సైల్స్ ఎంబీడీఏ కంపెనీ ప్రతినిధులు, ఏరో క్యాంపస్ అక్విటిన్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై, రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యటించాలని ఎంబీడీఏ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు.
అనంతరం ఫ్రాన్స్లోని భారత రాయబారి జావెద్ అష్రఫ్తో భేటీ అయ్యారు. ఫ్రెంచ్ కంపెనీలకు అవకాశం ఉన్న రంగాల గురించి వివరించారు. అలాగే పారిస్లో కాస్మోటిక్ వ్యాలీ డిప్యూటీ సీఈఓ ఫ్రాంకీ బెచెరోతోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్లో సౌందర్య సాధనాల మార్కెట్, గణనీయమైన వృద్ధితో పాటు తెలంగాణలో కాస్మోటిక్ తయారీకి ఉన్న అవకాశాలను వివరించారు. కేటీఆర్ వెంట ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం ఉన్నారు.