హైదరాబాద్/సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘నూరు పూలు వికసించేందుకు.. వేయి ఆలోచనలు సంఘర్షించేందుకు పుస్తక ప్రదర్శనలే వేదికలని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ర్టాన్ని జ్ఞాన తెలంగాణగా నిర్మించేందుకు పుస్తకాలు పనిముట్టుగా పనిచేస్తాయని చెప్పారు. చరిత్రను వక్రీకరించే వాళ్లను గుర్తించాలన్నా, అసలు చరిత్రను అవగతం చేసుకోవాలన్నా ఈతరం పుస్తక పఠనం కొనసాగించాలని ఆయన ఉద్బోధించారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే 35వ జాతీయ పుస్తక ప్రదర్శన పోస్టర్ను బుధవారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ ఆవిషరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ జ్ఞాన ఆయుధంతో సత్యాగ్రహ మార్గంలో 14 ఏండ్లు రాష్ట్ర సాధన మహోద్యమాన్ని నడిపి స్వరాష్ర్టాన్ని సాధించారని గుర్తు చేశారు. పుస్తకాలు తయారుచేసిన వ్యక్తులే ఏ రంగంలోనైనా అత్యున్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. జ్ఞానమార్గంలో వచ్చిన అనేక శాస్త్ర, సాంకేతిక విప్లవాలపైనే జాతులు, దేశాల పురోభివృద్ధి ఆధారపడి ఉంటుందని చెప్పారు.
ఒక సమాజం అత్యున్నత స్థాయికి ఎదిగి మార్గదర్శకంగా నిలబడటానికి పుస్తకాలే చోదకశక్తిగా నిలుస్తాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. సాధించిన ప్రగతికి, సాధించాల్సిన లక్ష్యానికి పుస్తకమే పునాదిరాయిగా ఉంటుందని పేర్కొన్నారు. భిన్న సంస్కృతుల, భిన్న భాషల వేదికగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్న హైదరాబాద్లో బుక్ ఫెయిర్ అన్ని సంస్కృతులకు ఆలవాలమై నిలుస్తున్నదని కొనియాడారు. ఉత్తములను, సంసారవంతులను తయారుచేసే జ్ఞాన కర్మాగారమైన పుస్తక ప్రదర్శనను హైదరాబాద్లో 35 ఏండ్ల్లుగా విజయవంతంగా కొనసాగటం ఇక్కడి చైతన్యానికి నిదర్శనమని తెలిపారు. బుక్ ఫెయిర్లో తాను కూడా పాల్గొంటానని, కొత్త పుస్తకాలను అధ్యయనం చేసేందుకు వస్తానని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్వాహకులు రాఘవ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ గురువారం ఎన్టీఆర్ స్టేడియం (కళాభారతి) వేదికగా ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. మొత్తం 340 స్టాల్స్ ఏర్పాటు చేశారు. జనవరి 1 వరకు ఈ పుస్తక జాతర కొనసాగుతుంది. ప్రదర్శన ఏర్పాట్లను హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ బుధవారం పరిశీలించారు. ఈ ప్రదర్శనకు 33 జిల్లాలతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ర్టాల నుంచి అన్ని పబ్లికేషన్స్ వారు రానున్నారు. ఎప్పటి లాగే సాహిత్య కార్యక్రమాలు, స్త్రీవాదం, దళిత, బహుజన, మైనార్టీ, గిరిజన, ఆదివాసీ, డోలు, తుడుందెబ్బ సాహిత్య ప్రదర్శనలు ఉండనున్నాయి. సాహిత్యంపై చర్చలు జరగనున్నాయి. విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం ఉంటుంది. ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతోపాటు అన్ని దినపత్రికల ఎడిటర్లు హాజరవుతారు. టికెట్ ధర ఎప్పటిలాగే రూ.10 ఉన్నది.