హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో పేదలకు పనికొచ్చేది ఒక్కటీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపిందన్నారు. రాష్ట్రానికి నిధుల మంజూరులో కేంద్రం వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్లలో రూ.303 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. మౌలిక వసతులకు కేంద్రం బడ్జెట్లో నిధులు ఇవ్వలేదన్నారు. కేంద్రం సహకరించకపోయినా సంక్షేమ కార్యక్రమాలు ఆగవని స్పష్టం చేశారు.
పేదలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. త్వరలోనే 58, 59 జీవో తీసుకొస్తామని, ప్రతి పేదవాడికి పట్టాలు ఇచ్చే బాధ్యత తనదని చెప్పారు. జవహర్నగర్ డంపింగ్ యార్డ్ వల్ల దుర్వాసన రాకుండా చేశామన్నారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ప్రారంభించుకున్నామని తెలిపారు. తడి చెత్త నుంచి ఎరువులను ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించారు.
త్వరలోనే 24 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును ప్రారంభిస్తామన్నారు. రూ.147 కోట్లతో గ్రీన్ క్యాపింగ్ పనులు చేపట్టామన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత సమస్య చూపుతామని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యకరమైన పరిస్థితులు కల్పిస్తామన్నారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో మేడ్చల్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మంత్రి మల్లారెడ్డి కోరిన ప్రతి కోరిక నెరవేర్చుతామన్నారు.
రూ.1200 కోట్లతో ఔటర్ రింగ్రోడ్డు లోపల అన్ని మున్సిపాలిటీలకు తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలో కొత్తగా 50 వేల మంచినీటి కనెక్షన్లు ఇస్తామన్నారు. మేడ్చల్ నియోజకవర్గానికి తాగు నీటికోసం రూ.240 కోట్లు మంజూరు చేశామన్నారు. వెజ్, నాన్వెజ్ మార్కెట్ల కోసం రూ.15 కోట్లు కేటాయించామన్నారు.
గతంలో సర్కారు దవాఖానకు వెళ్లలేని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటళ్లలో మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విదేశీ విద్యకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించామని వెల్లడించారు. ‘మనఊరు-మనబడి’ కింద రూ.7289 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.