హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు చాలా బాగున్నాయని ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యూఈఎఫ్) బృందం ప్రశంసించింది. అంతేగాక అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిని కనబర్చింది. ఇందులోభాగంగానే తమ మిషన్లో వ్యూహాత్మక, ప్రధాన భాగస్వామిగా తెలంగాణ ప్రభుత్వాన్ని చేర్చుకుంటామన్నది. మంగళవారం ప్రగతిభవన్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో డబ్ల్యూఈఎఫ్ ప్రతినిధుల బృందంతోపాటు రాష్ట్రంలోని ప్రముఖ లైఫ్ సైన్సెస్, ఔషధ రంగ పరిశ్రమల అధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే డబ్ల్యూఈఎఫ్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను మెచ్చుకుంటూ పైవిధంగా స్పందించారు. ఇక తెలంగాణలో లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టంను మరింత బలోపేతం చేయడంతోపాటు హైదరాబాద్ను గ్లోబల్ హెల్త్ నెట్వర్క్లో చేర్చేందుకు అనుసరించాల్సిన మార్గాలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్న కృషినీ డబ్ల్యూఈఎఫ్ ప్రతినిధులు కొనియాడారు.
లైఫ్ సైన్సెస్కు పెద్దపీట
లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో ఎన్నో చర్యలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ను పెంపొందించడంతోపాటు ఈ రంగంలో హైదరాబాద్కున్న ఖ్యాతిని ఇంకా విస్తరించేందుకు తమ నిర్ణయాలు దోహదపడుతున్నాయని చెప్పారు. సమావేశంలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చైర్మన్ సతీశ్రెడ్డి, బయోలాజికల్-ఈ లిమిటెడ్ ఎండీ మహిమ దాట్ల, అరబిందో ఫార్మా డైరెక్టర్ పీ శరత్ చంద్రారెడ్డి, నోవార్టిస్ బిజినెస్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్ నవీన్ గుళ్లపల్లి, మెడ్ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ సీనియర్ డైరెక్టర్ దివ్య జోషి పాల్గొన్నారు. అలాగే డబ్ల్యూఈఎఫ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న హెల్త్ అండ్ హెల్త్కేర్ సంస్థ అధిపతి డాక్టర్ శ్యామ్ బిషెన్, డిప్యూటీ హెడ్ శ్రీరామ్ గుత్తా, సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ హెడ్ పురుషోత్తం కౌశిక్ తదితరులు కూడా ఉన్నారు.