ఎల్లారెడ్డిపేట: నాయకులు ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ప్రజలు వారి గోడు వెళ్లబోసుకుంటారు. వారిలో కొందరి బాధలు అత్యంత దయనీయంగా ఉంటాయి. అలాంటి వారికి సాయం చేస్తామని నేతలు హామీలు ఇస్తుంటారు. ఆ తర్వాత బాధితులు కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగితే తప్ప ఆ హామీ నెరవేరదు. కానీ బీఆర్ఎస్ నేతలు అలా కాదు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) మరీ స్పెషల్. ఆయన ఏదైనా హామీ ఇచ్చారంటే గంటల్లో నెరవేరుతుంది. బాధితుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తుంది.
తాజాగా అలాంటిదే మరో సందర్భం వచ్చింది. ‘సార్ నాకు సాయం జెయ్యుర్రి. భార్య చనిపోయింది. ఇద్దరు బిడ్డల సాదుకునుడు కష్టమైతుంది. ఒక ఆటో ఇప్పించండి’ అని మంగళవారం ఓ దివ్యాంగుడు మంత్రి కేటీఆర్ను అర్థించాడు. అందుకు స్పందించిన మంత్రి.. సాయం చేస్తానని మాటిచ్చారు. అంతేగాక 24 గంటల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దివ్యాంగుడి కల నెరవేర్చి అతని కళ్లలో ఆనందాన్ని నింపారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ఆకారం నర్సయ్య దివ్యాంగుడు. ఇంటి పోషణ భారం మోస్తున్న భార్య కొద్ది రోజుల క్రితమే మృతిచెందింది. దాంతో ఇద్దరు కూతుళ్లు మాధురి, గౌతమిల పోషణ నర్సయ్యకు కష్టమైంది. ఈ క్రమంలోనే మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో డేకేర్ సెంటర్ను ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ వచ్చారు.
ఈ సందర్భంగా దివ్యాంగుడు నర్సయ్య మంత్రి కేటీఆర్ను కలిశాడు. తన దీనస్థితిని వివరించి, బతుకుదెరువు కోసం ఓ ఆటోను ఇప్పించాల్సిందిగా కోరాడు. అతడి బాధ విని చలించిన మంత్రి.. సానుకూలంగా స్పందించారు. నర్సయ్యకు సాయం చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అక్కడికక్కడే కలెక్టర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ జయంత్కుమార్ బుధవారం నర్సయ్యను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు.
వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్.. నర్సయ్యకు కొత్త ఆటో మంజూరైనట్లు ప్రకటించగానే అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆ తర్వాత తనకు సాయం చేసిన మంత్రి కేటీఆర్కు నర్సయ్య కృతజ్ఞతలు తెలిపాడు. మంత్రి కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు.