హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేనేత కార్మికులకు ఉన్న పథకాలను రద్దు చేస్తూ పోతుంటే.. తాము మాత్రం పోరుగడ్డపై పేగుబంధమున్న చేతన్నలందరినీ బతికించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, చేనేత జౌళీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా చేనేత జౌళీశాఖలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారతదేశంలో వ్యవసాయం తర్వాత అంతమందికి ఉపాధి కలిగించే రంగాలు చేనేత, జౌళీ.
రాష్ట్రం ఏర్పడక ముందు చేనేత, జౌళీశాఖలకు కాంగ్రెస్ ప్రభుత్వం చివరి బడ్జెట్ 2013-14లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పెట్టింది రూ.70 కోట్లు. ఇవాళ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రికార్డుస్థాయిలో బడ్జెట్ కేటాయింపులే కాకుండా అద్భుతమైన పథకాలు తీసుకువచ్చారు. చేనేత, పవర్లూం కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ, రంగంపై ప్రధాని మోదీ, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ కత్తికట్టినట్లుగా వ్యవహరిస్తున్నదని’ కేటీఆర్ విమర్శించారు.
‘ఈ ఎనిమిదేళ్లలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు పెద్ద లిస్టే ఉన్నది. ప్రస్తుతం ఉన్న కంటే ముందు 14 మంది ప్రధానులు పని చేశారు. ఏ ప్రధాని చేయని ఆలోచన.. మోదీ చేశారు. చేనేత ఉత్పత్తులపై 5శాతం పన్ను విధించాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు ఎన్నిసార్లు చెప్పినా.. లక్షల ఉత్తరాలు రాసిన ఇప్పటి వరకు ఉలుకూ పలుకు లేకుండా ఉండడం శోచనీయం. 5శాతం పన్నును 12శాతం వేసి చేనేత కార్మికులను సావగొట్టాలని ఆలోచన చేస్తున్నట్లుగా వినబడుతున్నది. ఇకనైనా 5శాతం పన్నును విరమించుకొని జీరోకు మార్చి.. గతంలో ఉన్న సంప్రదాయాన్ని కొనసాగాలని రాష్ట్రంలోని చేనేత కార్మికులందరి తరఫున హృదయపూర్వకంగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా.
కేంద్రం ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నది. ఆలిండియా హ్యాండీ క్రాఫ్ట్ బోర్డు రద్దు చేశారు. ఆల్ ఇండియా పవర్లూం బోర్దు చేయడంతో దాని కింద పని చేసే ఎనిమిది టెక్స్టైల్ పరిశోధనా సంస్థలు నిర్వీర్యం అయ్యాయి. జాతీయ హ్యాండ్ లూమ్ బోర్డు, ఆల్ ఇండియా జూట్ బోర్డు హైదరాబాద్లో ఉన్న కార్యాలయాన్ని తొలగించారు. చేనేత సహకార సంఘం సభ్యుల థ్రిఫ్ట్ ఫండ్ పథకంలో కేంద్రం వాటా నాలుగుశాతం ఉంటే దాన్ని రద్దు చేశారు. చేనేత కార్మికుల కోసం ఉద్దేశించిన లాంబార్డ్ హెల్త్ ఇన్సురెన్స్, భూంకార్ బీమా యోజన పథకం, హౌస్ కం షెడ్ పథకాలు రద్దు చేయడంతో పాటు మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకం నిబంధనలు తొలగించి అందని ద్రాక్షలా మార్చింది. శుష్క వాగ్ధాలు, రిక్త హస్తాలు ఉన్నట్లుంది’ అంటూ మండిపడ్డారు.
‘దేశవ్యాప్తంగా నేతన్నల కడుపు కేంద్రం కొడుతున్నది. ఉమ్మడి ఏపీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెల్లూరు వెంకటగిరిలో ఉండేది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇక్కడ నేతన్నల పిల్లల భవిష్యత్ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని పదిసార్లు కోరాను. ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కావాలని కోరినా స్పందన లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో సిరిసిల్ల, కమలాపూర్, జమ్మికుంట, చొప్పదండిలోని గర్షకుర్తి ప్రాంతంలో నేతన్నలుంటాయి.
ఒకసారి కాదు ఎనిమిదేళ్లుగా ‘ఎక్కని కొండలేదు.. మొక్కని బండలేదన్నట్టు’ ఎవరు కేంద్రంలో మంత్రి ఉంటే కలిశాం. సిరిసిల్లకు మెగా పవర్లూం క్లస్టర్ మంజూరు చేయాలని, జమ్మికుంట, కమలాపూర్కు హ్యాండ్లూం క్లస్టర్లు ఏర్పాటు చేయాలని మొత్తుకున్నా స్పందన లేదు. బీజేపీ ఎంపీ కరీంనగర్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నా ఫలితం శూన్యం. కేంద్రం ప్రభుత్వం నేతన్నలకు వాతలు పెడుతూ పోతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు తీసుకువచ్చాం. చేనేత మిత్ర పథకం కింద భారతదేశం మొత్తంలో నూలు, రసాయనాలపై 50శాతం సబ్సిడీ ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ, ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్’ అన్నారు.
‘చేనేతన్నకు చేయూత పథకంతో కార్మికుడి సామాజిక భద్రత తెచ్చాం. పవర్లూం కార్మికుల కోసం థ్రిఫ్ట్ పథకం కింద రూ.100కోట్లు కరోనా సమయంలో బక్కచిక్కిన 25వేల నేతన్న కుటుంబాలకు లాభం చేకూరింది. గతంలో సొసైటీలు మాఫీ చేస్తే తెలంగాణ ప్రభుత్వం రూ.39కోట్ల వ్యక్తిగత రుణాలు మాఫీ చేసింది. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ భూదాన్ పోచంపల్లిలో ఏడుగురు చేనేత కార్మికులు ఒకే రోజు చనిపోతే జోలెపట్టి విరాళాలు సేకరించి ఆ నాడు రూ.3.50లక్షలు సేకరించి కుటుంబానికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. సిరిసిల్లలో ఒకే వారంలో తొమ్మిది మంది కార్మికులు చనిపోతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా పట్టించుకోకపోతే.. పార్టీ తరఫున రూ.50లక్షలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ది.
ఈ విషయం అప్పటి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఈటల రాజేందర్కు తెలుసు. నేతన్నల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ రూ.5లక్షల నేతన్న బీమా తీసుకువచ్చి అమలు చేస్తున్నారు. కొత్తగా ఇటీవల కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో అవార్డులు ఇస్తున్నాం. ఏ ఆశయంతో తెలంగాణ సాధించుకున్నామో.. ఆశయం నెరవేరి ఫలితం మన బిడ్డలకు దక్కుతున్నప్పుడు అందరికన్నా ఎక్కువ సంతోషపడేది మామే. వరంగల్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో సూరత్కు, గుజరాత్కు తదితర ప్రాంతాలకు కార్మికులు వలుస పోయి 364 కుటుంబాలు.. ఇప్పుడు ఓనర్లుగా తిరిగి వచ్చారంటే కేసీఆర్ ప్రభుత్వం ఘనత కాదా?’ అని ప్రశ్నించిన కేటీఆర్.. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు అంటూ ధ్వజమెత్తారు.