Minister ktr | గతంలో ఎన్నడూ లేని విధంగా హుజూరాబాద్, మునుగోడులోనే ఎన్నికలు డబ్బు మయం
అయ్యాయని ఆరోపణలు వచ్చాయని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ వ్యవహరించిన తీరును తూర్పారబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజలను సూటిగా ఒక్క మాట అడుగుతున్నా. ఎన్నికలు డబ్బు మయం అయ్యాయని కొందరు ఆక్రోషిస్తున్నారు. నేను సూటిగా అడుగుతున్నా.. ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిది సంవత్సరాల్లో ఎన్నో ఉప ఎన్నికలు వచ్చాయి. నారాయణఖేడ్, పాలేరు, దుబ్బాక, హుజూర్నగర్, నాగార్జున సాగర్లో ఎక్కడా ఈ పరిస్థితి లేదు? ఎందుకు హుజూరాబాద్లో, మునుగోడులోనే డబ్బులు మయం అయ్యాయని ఆరోపణలు వచ్చాయ్? వందల కోట్ల రూపాయలు వచ్చినయ్? ఎందుకంటే ఈటెల రాజేందర్ అనే ధనవంతుడు, కోమటిరెడ్డి గోపాల్రెడ్డి అనే ధనవంతుడు.. వీళ్లిద్దరు దిగిన తర్వాత ఉప ఎన్నికలు ధనమయమయ్యాయి’ అని కేటీఆర్ మండిపడ్డారు.
‘ఈటల, కోమటిరెడ్డితోనే హుజూరాబాద్, మునుగోడులో ఉప ఎన్నిక కలుషితమైంది. ఇతర ఏ ఎన్నికల్లో కూడా నాగార్జున సాగర్, హుజూర్నగర్ ఉప ఎన్నికలు ఇదే నల్లగొండ జిల్లాలో జరిగినా ఇలాంటి అడ్డమైన ఆరోపణలు రాలే. ఇక్కడ మాత్రమే వచ్చాయి.. తెలంగాణ ప్రజలను నేను అడుగుతున్నా.. ఆలోచించండి. డబ్బు మయం అయ్యాయంటే ఎవరు చేస్తన్నారు. ధనవంతులను తీసుకొచ్చి ధనస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ పార్టీ కాదా? ఇద్దరు ధనవంతులకు వందలకోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి పంపి తిమ్మిని బమ్మి చేసైనా గెలవండి అని ఆదేశమిచ్చి.. ఈ రోజు ఎన్నికల్లో అడ్డదారులు తొక్కుతున్నది.. అడ్డంగా దొరికింది బీజేపీ కాదా? నేను చెబుతున్నది వాస్తవం కాదా? మేం అడ్డదారులు తొక్కి ఉంటే.. 40 ఐటీ టీమ్లు, 15 కంపెనీల సీఆర్పీఎఫ్ పోలీసులు వీరంతా లేరా? ఇవాళ నోటికివచ్చినట్లు బీజేపీ నేతలు కారుకూతలు కూస్తున్న బీజేపీ నాయకులు’ అని ధ్వజమెత్తారు కేటీఆర్.
‘ఓటమిని హుందాగా అంగీకరించే దమ్ముండాలి.. సంస్కారం ఉండాలి. మేము గతంలో దుబ్బాకలో వెయ్యి ఓట్ల స్వల్ప తేడాతో, హుజూరాబాద్లో ఓడిపోయాం.. ఓటమి అనంతరం హుందాగా ఒప్పుకున్నం. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించే ఇంగితం, సోయి, సంస్కారం ఉండాలి. ఓడిపోగానే నెపాలు పెట్టి.. నిందలు పెట్టడం.. చిల్లర మల్లర మాటలు మాట్లాడడం.. డబ్బు మయమైపోయిందని ఆక్రోషించడం ఎవరి వల్ల అయ్యింది. ఒక్క హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లోనే ఎందుకు అయ్యింది? అక్కడి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు వందలకోట్లు ఇచ్చిన పార్టీ ఏదీ? ఎందుకు జరిగినయ్ ఈ ఉప ఎన్నికలు.. ఇంత స్థాయిలో డబ్బు ఎందుకు ఖర్చు అయ్యిందో భారతీయ జనతా పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలు ఆలోచన చేయాలి. ఈ రోజు కాంట్రాక్టులు, కాసులు ఇచ్చి వందలకోట్ల రూపాయలతో తెలంగాణలో ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేసినా మా అభ్యర్థి గతంలో కంటే ఎక్కువ ఓట్లతో విజయం సాధించారు. మునుగోడు ఎన్నికల్లో 97వేల ఓట్లు వచ్చాయి. గతంలో కంటే 23వేల ఓట్లు ఎక్కువ పోలయ్యాయి. ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచింది 22వేల ఓట్లతో.. మళ్లీ ఈ రోజు ఆయన ఓడిపోయింది 10వేల పైచీలుకు ఓట్లతో. దాదాపు 33వేలకుపైగా ఓట్లు రివర్సై ఓడిపోయాడంటే.. వారి పార్టీకి ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చినట్లు కాదా? అని అడుగుతున్నా’నన్నారు.
‘గత ఎన్నికలతో పోలిస్తే.. టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగింది. ఆనాడు మునుగోడులో
34.29శాతం.. ఇవాళ టీఆర్ఎస్కు 43శాతం ఓట్లు వచ్చాయి. ఎన్ని ప్రలోభాలు, కుట్రలు, కుతంత్రాలు ఎదురైనా.. తొమ్మిది శాతం ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. మెజారిటీ తగ్గింది కాబట్టి.. మేం కూడా కావాలంటే చాలా చెప్పొచ్చు. ఎన్నికల కమిషన్ను తూర్పారబట్టొచ్చు. ఎన్నికల కమిషన్ ఎలా వ్యవహరించిందో గతంలో చెప్పాం. గతంలో ఈసీ తొలగించిన రోడ్డు రోలర్ గుర్తును మళ్లీ బలవంతంగా తెలంగాణ ప్రజలపై రుద్ది.. పై నుంచి ఎవరి ఆదేశాలున్నాయోకారు గుర్తులను పోలిన గుర్తులను బలవంతంగా తీసుకువచ్చారు. ఇవాళ కారు గుర్తులను పోలిన గుర్తులకు ఇవాళ ఆరువేల ఓట్లు వెళ్లాయి. లేదంటే టీఆర్ఎస్ అభ్యర్థి 17వేల ఓట్ల మెజారిటీతో గెలువాల్సింది. ఇన్ని రకాల ప్రయత్నాలు, అర్థరహితమైన ప్రయోగాలు. మొన్న ఢిల్లీ నుంచి వచ్చిన బ్రోకర్లతే డైరెక్ట్గా ఈవీఎంలను సైతం మేనేజ్ చేస్తామని చెబుతున్నారు. ఈవీఎంలను మేనేజ్ చేశారని, గుర్తులను తారుమారు చేశారని, అపసవ్యపు పద్ధతుల్లో అడ్డదారుల్లో గెలిచే ప్రయత్నం చేశారని చెప్పొచ్చని.. రెండు శిఖండి పార్టీలను మా ముందు పెట్టి ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. కానీ, గెలుపైనా, ఓటమైనా దాన్ని సమానంగా. స్థితప్రజ్ఞతతో స్వీకరించే ధీరోదాత్తత టీఆర్ఎస్కు ఉంది కాబట్టే గెలుపుకి పొంగిపోవడం.. అపజయానికి కుంగిపోవడం మాకు అలవాటు లేదు’ అన్నారు.
‘మా గుర్తులను పోలిన గుర్తులను ఎన్నింటిని తెచ్చినా.. రాజగోపాల్రెడ్డిని కొన్ని గ్రామాల్లో ఛీత్కరించినా,
తరిమికొట్టినా మేం వాటిని ఎలక్షన్ ఇష్యూ కింద చేయలేదు. ప్రజాస్వామ్యం ఎవరైనా ఎవరి ప్రచారం వారు
చేసుకుంటరు. పల్లా రాజేశ్వర్రెడ్డి పలివెల గ్రామంలో ప్రచారం చేస్తుండగా కెలికి కయ్యంపెట్టుకొని.. రాళ్లతో దాడి చేసి, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్పర్సన్పై దాడి చేసి 12 మంది టీఆర్ఎస్ కార్యకర్తలను రక్తం కళ్లచూసి.. తెల్లారి మళ్లీ మాకేదో జరిగి పోయింది.. మాపైనే హత్యా ప్రయత్నం అని కుసంస్కారపు మాటలు.. పనికి మాలిన డ్రామాలు చేశారు. ఇదంతా ఎన్నికల ప్రచారం ముగిసి.. రేపు ఓటింగ్ అనగా.. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతూ ఈటల రాజేందర్ ప్రెస్మీట్ పెట్టి.. సానుభూతి కోసం డ్రామాలు ఆడారు. ఇంత కంటే దిగజారుడు రాజకీయం ఉంటదా? తొండి మనిషి బండి సంజయ్ అర్ధరాత్రి చిల్లర డ్రామాలు చేశారు. ఈ డ్రామాలు ప్రజలు పట్టించుకోలేదు. లేని సింపతి కోసం రిటర్నింగ్ కార్యాలయం ఎదుట ధర్నాలు పేరుతో చిల్లర రాజకీయాలు, సానుభూతి కోసం ఆడటని నాటకం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరికి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసినా టీఎన్జీవోలను సైతం నోటికి వచ్చినట్లు చిల్లర వ్యాఖ్యలు చేశారు’ అని మండిపడ్డారు కేటీఆర్.