హైదరాబాద్ : టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఐటీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను రేవంత్ గాడిదతో పోల్చిన ఓ న్యూస్ క్లిప్ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. థర్డ్ రేట్ క్రిమినల్కు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఇలానే ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. పీసీసీ చీప్ అని రేవంత్ను మంత్రి తన ట్వీట్లో విమర్శించారు. ఇటీవల ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ తన బృందంతో హైదరాబాద్లో పర్యటించి, ఐటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. ఐటీ అభివృద్ధికి కృషి చేస్తున్న కేటీఆర్ను కూడా శశిథరూర్ కొనియాడారు.
అయితే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పర్యటనపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సమాచారం లేదు. ఈ నేపథ్యంలోనే శశిథరూర్ పర్యటనను రేవంత్ రెడ్డి ముందు ప్రస్తావించగా మండిపడినట్టు ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. శశిథరూర్ ఓ గాడిద అని, ఆయనను పార్టీ త్వరలోనే బహిష్కరిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లు ఆ కథనంలో ఉంది.
మంత్రి కేటీఆర్ ట్వీట్కు టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. నిజంగా రేవంత్ పీసీసీ ‘చీప్’ అని క్రిశాంక్ పేర్కొన్నారు. ఐటీపై ఆయనకు అసలు ఇన్ఫర్మేషన్ ఉండదు. ఐటీలో తెలంగాణ సాధించిన అభివృద్ధి ఆయనకు అర్థం కాదు. ఇలాంటి వ్యక్తిని పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం.. బ్యాడ్ చాయిస్ అంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ట్యాగ్ చేశారు క్రిశాంక్. కాంగ్రెస్ లీడర్లను గౌరవించడం నేర్చుకోవాలని రేవంత్కు క్రిశాంక్ చురకలంటించారు.