KTR | నిర్మల్ : నిన్న ప్రధాని మోదీ.. గాలి మోటర్లో వచ్చి గాలి మాటలు మాట్లాడిండు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే ఆయన అంటడు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కాంగ్రెసోళ్లు అంటరు. నేను ఒక్కటే చెప్తున్నా.. బీజేపీ కాంగ్రెస్ నాయకులకు. మేం రోషంగళ్ల బిడ్డలం. ఆత్మగౌరవం కలిగిన బిడ్డలం. మేం ఢిల్లీ గులామ్లం కాదు.. గుజరాతీ గులామ్లం కాదు.. ఢిల్లీకి బానిసలం కాదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
నిర్మల్ పట్టణంలో వందల కోట్ల రూపాయాలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మేం ఎవ్వని అయ్యకు భయపడం అని కేటీఆర్ తేల్చిచెప్పారు. మేం ఎవనికి బీ టీమ్ కాదు. మేం తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి. తెలంగాణ ప్రజల ఏ టీం తప్పా ఎవరికి బీ టీం కాదు. మీరు ఢిల్లీకి భయపడ్తరు. ఢిల్లీకి సలాం కొడుతరు. గుజరాత్కు గులాంగిరి చేస్తరు. మాకు ఆ ఖర్మ పట్టలేదు. మాకు తెలంగాణ గల్లీల్లో ఉండే మా తమ్ముళ్లు, అన్నలు, అక్కలు, చెల్లెళ్లు వాళ్లు ఏమనుకుంటారనేది మాకు ముఖ్యం. మీరు ఏమనుకుంటరు.. ఢిల్లీకెళ్లి వచ్చి ఇచ్చిపోయే కితాబులు మాకు అవసరం లేదు. మీరు చేసిన మోసాలు చెప్పాలంటే ఒకటా..? రెండా..? గ్యాస్ సిలిండర్ ధర పెంచిన మోదీని ఏమనాలి. పెట్రోల్, డిజీల్, నిత్యవసరాల ధరలను పెంచిన మోదీ దేవుడట.. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి తెచ్చిన కేసీఆర్ దెయ్యమట. ఇది మనం వినాలట.. నమ్మలాట. పిచ్చోళ్లకు ఓటేయాల్నటా..? అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఈ దేశంలో దళితబంధు లాంటి పథకం ఎక్కడైనా ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దమ్మున్న నాయకుడి వల్లే ఇలాంటి పథకాలు సాధ్యమవుతాయి. ఉట్టిగనే కొబ్బరికాయలు కొట్టి, రిబ్బన్లు కట్ చేసి, ఊపిన రైలుకే పదిసార్లు జెండా ఊపే నాయకులతోటి ఏం కావు. అదేం రైలు నాకర్థం కాదు. ఒకటే రైలుకు ఒకటే ఊపుడు… ఆయనకు సందు ఇస్తే అదే రైలు ఎక్కి.. ప్రతి స్టేషన్లో దిగి ఊపుతాడు ఇక. అట్ల తయారైండు మోదీ. నాకు మోదీతో పంచాయితీ లేదు. కానీ నవ్వు వస్తుంది. ఆయన మాటలు వింటుంటే నిజంగా కూడా గమ్మత్తు అనిపిస్తుంది. కేసీఆర్ నన్ను సీఎం చేయాలనుకున్నడట. అనుకుంటే.. ఆయనకు ఎందుకు చెప్తాడు. ఆయన దగ్గర అనుమతి తీసుకునే అవసరం ఏముంది? మా పార్టీలో ఎవరు సీఎం కావాలో ఎమ్మెల్యేలు, ప్రజలు నిర్ణయిస్తారు. మోదీ దగ్గర ఎన్వోసీ తెచ్చుకునే అవసరం ఏముంది. ఆ ఖర్మ ఏమున్నది. ఆయన చెప్పే మాటలు పచ్చి అబద్ధాలు అని మోదీపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.